బాలు ఆరోగ్యంపై పీఎమ్ కార్యాలయం ఆరా!.. వీడియో విడుదల చేసిన తనయుడు ఎస్పీ చరణ్..

  • Published By: sekhar ,Published On : August 17, 2020 / 11:49 AM IST
బాలు ఆరోగ్యంపై పీఎమ్ కార్యాలయం ఆరా!.. వీడియో విడుదల చేసిన తనయుడు ఎస్పీ చరణ్..

కరోనా బారిన పడిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. సామాన్యులు, సంగీత ప్రియులు, పలు భాషలకు చెందిన సినీ పరిశ్రమల వారు ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవల ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా మారడంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.



బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తన తండ్రి ఆరోగ్యం కాస్త మెరుగు పడిందని, ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం శ్వాస సులభంగా తీసుకుంటున్నారని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ వెల్లడించారు.

తాజాగా ప్రధాని కార్యాలయ అధికారులు బాలు ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీసినట్టు తెలుస్తోంది. బాలు చికిత్సకు సంబంధించిన వివరాల గురించి ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారట. అలాగే ప్రభుత్వం తరఫున తమిళనాడు సీఎం పళని స్వామి కూడా ఎప్పటికప్పుడు బాలు చికిత్సకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారట.



బాలు ఆరోగ్యం గురించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇప్పటికే ఆస్పత్రి యాజమాన్యంతో మాట్లాడారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఎటువంటి పుకార్లు వ్యాపించకుండా ఆసుపత్రి వర్గాలవారు ప్రతిరోజూ బాలు ఆరోగ్యానికి సంబంధించిన అప్‌డేట్ అధికారికంగా ప్రకటిస్తున్నారు.