ఆ హీరోలిద్దరూ నా లవర్స్ కాదు.. మంచి ఫ్రెండ్స్ అంతే..
2009 లో ‘వామనన్’ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమకు పరిచయమైంది ప్రియా ఆనంద్. తెలుగులో ‘లీడర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకుని, ‘180’ చిత్రం ద్వారా హీరోయిన్గా మంచి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం పలు తమిళ చిత్రాల్లో నటిస్తున్న ప్రియా ఆనంద్ ప్రేమలో పడిందంటూ సోషల్ మీడియాలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ప్రియాతో దివంగత నటుడు మురళి కుమారుడు, యువనటుడు అధర్వ(వాల్మికి- గద్దలకొండ గణేష్ ఫేమ్) సన్నిహితంగా మెలుగుతున్నాడని, ఇద్దరూ ప్రేమలో పడ్డారని పుకార్లు వచ్చాయి. ఆ తర్వాత నటుడు కార్తీక్ తనయుడు గౌతమ్తోనూ ప్రియా ఆనంద్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందని, వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని, త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ప్రియా ఆనంద్ తాజాగా స్పందించింది.
అధర్వ, గౌతమ్ తనకు మంచి స్నేహితులని, వారిలో ఎవరినీ తాను ప్రేమించడం లేదని స్పష్టం చేసింది. మా ముగ్గురి మధ్య కష్టసుఖాలను పంచుకునేంత ఆత్మీయత ఉందని, మేం మంచి స్నేహితులు గానే కొనసాగాలని నిర్ణయించుకున్నామని ప్రియా ఆనంద్ తెలిపింది. వారిద్దరు స్నేహితులు తనలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పింది.
దీంతో, సేమ్ డైలాగ్.. ఇంతకుముందు ప్రేమలో ఉన్న చాలామంది హీరో హీరోయిన్లు కూడా మా మధ్య ఏం లేదు మేం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పారు. ఆ తర్వాత ఒకటైన వాళ్లూ ఉన్నారు. నువ్వు కూడా అదే డైలాగ్ చెబుతున్నావంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.