నిర్మాతల్లో దమ్ము, ధైర్యం ఉంటే టాలీవుడ్ సవ్యంగా ఉంటుంది.. హీరోలపై సి.కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్..
Tollywood Actors Remuneration: తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, అక్టివ్ తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ గిల్డ్ అందరూ కలిసి ఈ కరోనా సమయంలో ఇండస్ట్రీలో జరిగిన నష్టాన్ని గురించి చర్చించి నటీనటుల రెమ్యునరేషన్ తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
రోజుకు 20 వేలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే ఆర్టిస్టులకు 20 శాతం.. సినిమాకు ఐదు లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునే టెక్నీషియన్లకు 20 శాతం చొప్పున తగ్గించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పారితోషికాలు తగ్గడం గురించి నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ..
‘‘నిర్మాతలు పని కల్పించేవాళ్లు.. తమ దగ్గర పనిచేసే వారికి పారితోషికం నిర్ణయించాల్సింది వాళ్లే.. కాకపోతే 20 శాతం తగ్గించమని అందరినీ అడగడంలోనే నిర్మాతల అసమర్థత వెల్లడవుతోంది..
గ్రూపు రాజకీయాలతో ఇండస్ట్రీని డ్యామేజ్ చేస్తున్నారు. అది రైట్ కాదు.. కూర్చుని మాట్లాడుకోవాలి. నిర్మాతల్లో యూనిటీ లేకపోతే కష్టం. నిర్మాతల్లోనే కొందరు దొంగల్లాగా బిహేవ్ చేస్తూ, అవతలివారిని ఇబ్బందిపెట్టడం కరెక్ట్ కాదు.
నిర్మాతల్లో దమ్ము, ధైర్యం ఉంటే అంతా సవ్యంగా ఉంటుంది. అవసరాన్ని బట్టి కొందరు నిర్మాతలు గోడలు దూకుదామని ప్రయత్నిస్తే అది తప్పే అవుతుంది. ఈ నెల 15 నుంచి థియేటర్ల ఓపెనింగ్కి సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కానీ స్టేట్ గవర్నమెంట్ చెప్పాలి. జనాలు థియేటర్లకు వస్తారా? రారా? అనేది వేచి చూడాల్సిందే.
ఇప్పుడు పెద్ద సినిమాను కూడా రిలీజ్ చేయలేని పరిస్థితి ఉంది. 50 శాతం థియేటర్ల ఆక్యుపెన్సీతో బతికి బట్టకట్టలేం.. ప్రొడ్యూసర్స్కి ఎగ్జిబిటర్స్కి ఇది గడ్డు సమస్య’’.. అన్నారు. మరి సి.కళ్యాణ్ వ్యాఖ్యలపై మిగతా నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.