‘‘వోడ్కా వీరుడు.. సైకో సూరుడు.. సైకో వర్మ’’

  • Published By: sekhar ,Published On : September 23, 2020 / 05:08 PM IST
‘‘వోడ్కా వీరుడు.. సైకో సూరుడు.. సైకో వర్మ’’

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ జీవితం ఆధారంగా ఓ చిత్రం రూపొందుతోంది.. ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ తనయుడు నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్న చిత్రం ‘సైకో వర్మ’. ‘వీడు తేడా’ అనేది ఉపశీర్షిక. కృష్ణప్రియ, సుపూర్ణ మలకర్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో నిర్మాతగానే కాకుండా పలు చిత్రాలకు దర్శకత్వం వహించిన నట్టికుమార్ మళ్ళీ మెగాఫోన్ పట్టి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండటం ఓ విశేషం.

నట్టీస్ ఎంటర్‌టైన్మెంట్స్, క్విటీ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకాలపై నట్టి లక్ష్మి సమర్పణలో నిర్మాతలు అనురాగ్ కంచర్ల, నట్టి కరుణ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియో, తదితర ప్రాంతాల్లో జరుపుకొంది. తాజాగా ‘సైకో వర్మ’ టీజర్ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా నట్టి కుమార్ మాట్లాడుతూ ‘‘సినిమా బాగా వస్తోంది. నా కుమారుడు నట్టి క్రాంతి లీడ్ రోల్ బాగా పోషించారు. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.. రామ్ గోపాల్ వర్మ అభిమానిగా ఈ చిత్రంలోని హీరో క్రాంతి కనిపిస్తాడు. వయెలెన్స్, రొమాన్స్ అంశాలతో చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ చిత్రంలో కనిపించబోవడం ఓ విశేషం.


ఒకప్పుడు ‘శివ’, ‘సర్కార్’, ‘రంగీలా’ వంటి అద్భుత చిత్రాలను తీసిన వర్మ ఇప్పుడు తన పంథాని మార్చి తీస్తున్న విధానాన్ని పోలుస్తూ ఈ చిత్రంలో ఓ మంచి పాటను చిత్రీకరిస్తున్నాం. ‘పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే మన భాయి..’ అంటూ సాగే ఆ లిరికల్ సాంగ్‌ను ఇటీవల విడుదల చేయగా విశేషమైన స్పందన లభించింది. ఈ పాట చిత్రీకరణతోనే షూటింగును మొదలుపెట్టాం. హీరో, హీరోయిన్‌తో పాటు పలువురు డాన్సర్స్, జూనియర్ ఆర్టిస్టులు ఈ పాటలో పాల్గొన్నారు. పాట అద్భుతంగా వచ్చింది’’ అన్నారు.


హీరో నట్టి క్రాంతి మాట్లాడుతూ.. ‘‘నటించడానికి మంచి అవకాశం ఉన్న పాత్రను ఇందులో పోషిస్తున్నాను. నిర్మాతగా కూడా మా అక్కయ్య కరుణతో కలిసి సినిమాలు నిర్మిస్తూనే మంచి నటుడిగా నిరూపించుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు.


నిర్మాతలలో ఒకరైన నట్టి కరుణ మాట్లాడుతూ.. ‘‘ఈ రోజుతో మొదలైన చిత్రీకరణ నిరవధికంగా కొనసాగుతుంది. డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.

సంగీత దర్శకుడు ఎస్.ఏ.ఖుద్దూస్ మాట్లాడుతూ ‘‘టైటిల్ పాటకు వచ్చిన స్పందన అద్భుతం. గతంలో పలు చిత్రాలు చేసిన నాకు ఈ చిత్రం సెకండ్ ఇన్నింగ్స్ లాంటిది’’ అని అన్నారు. అప్పాజీ, మీనా, రూపలక్ష్మి, చమ్మక్ చంద్ర, కబుర్లు నవ్యా, రమ్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.