Puneeth Rajkumar: సామాజిక సేవలో పవర్ స్టార్.. రైతుల కోసం ఉచితంగా ప్రకటనల్లో నటించాడు
కన్నడ చిత్ర పరిశ్రమలో తన మార్క్ చూపించి, చిన్నవయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయార్ పునీత్ రాజ్కుమార్.
Puneeth Rajkumar: కన్నడ చిత్ర పరిశ్రమలో తన మార్క్ చూపించి, చిన్నవయస్సులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయార్ పునీత్ రాజ్కుమార్. పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్కి సినీ పరిశ్రమలో నటుడిగానే కాదు. బ్రాండ్ అంబాసిడర్గా కూడా పునీత్కి మంచి డిమాండ్ ఉంది. కర్నాటకలో అనేక ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు పునీత్.
అయితే, కన్నడ నాట అప్పుగా ముద్దుగా పిలుచుకునే పునీత్.. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సామాజిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేవాడు. తన తండ్రి డాక్టర్ రాజ్కుమార్ అడుగుజాడల్లో పునీత్ రాజ్కుమార్ కూడా ఎలాంటి పారితోషికం తీసుకోకుండానే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్(KMF) బ్రాండ్ అంబాసిడర్గా పనిచేశారు. పునీత్ KMF ఉత్పత్తులను ఎటువంటి ఒప్పందం లేకుండా ప్రమోట్ చేశారు.
1990లలో డాక్టర్ రాజ్కుమార్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండగా.. తర్వాతికాలంలో పదేళ్ల పాటు ఎవరూ బ్రాండ్ అంబాసిడర్గా లేరు. డాక్టర్ రాజ్కుమార్ రైతుల ప్రయోజనాల కోసం నందిని ఉత్పత్తుల తరపున ప్రచారం చేశారు. తర్వాత రైతుల కోసం పునీత్ రాజ్కుమార్ కూడా తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించేందుకు KMFతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
2006లో రాజ్ కుమార్ మరణించిన తర్వాత, KMFకి కొన్ని సంవత్సరాల పాటు అంబాసిడర్ లేరు. 2011లో పునీత్ రాజ్ కుమార్ని కలిసి అంబాసిడర్గా ఉండమని అభ్యర్థించారు కేఎంఎఫ్ చైర్మన్ సోమశేఖర్ రెడ్డి. ఎంత తీసుకుంటారు? అని అడగగా.. మా నాన్న పైసా తీసుకోకుండా కేఎంఎఫ్ను ప్రమోట్ చేసినప్పుడు.. నేను ప్రమోట్ చేయడానికి ఎలా డబ్బులు తీసుకుంటాను.. అంటూ ఉచితంగా బ్రాండ్ ప్రమోట్ చేసినట్లు కేఎంఎఫ్ వెల్లడించింది.
మొదటి సంవత్సరం నందిని గుడ్ లైఫ్ టెట్రా ప్యాక్ కోసం పునీత్ ప్రచారం చేశాడు. దేవరాయదుర్గంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో చిత్రీకరణ జరపాలని నిర్ణయించుకోగా అంగీకరించాడని, మూడు రోజుల పాటు షూటింగ్ జరిగిందని చెప్పారు అప్పటి కేఎంఎఫ్ చైర్మన్ సోమశేఖర్ రెడ్డి. చాలా నిరాడంబరంగా.. పిల్లలతో కలిసి కూర్చుని భోజనం చేసి, KMF ఉత్పత్తులకు ప్రచారం చేశారని వారు చెప్పారు.