మాహిష్మతి సామ్రాజ్యంలో ఉన్నా మాస్క్ తప్పనిసరి

  • Published By: bheemraj ,Published On : June 27, 2020 / 09:20 PM IST
మాహిష్మతి సామ్రాజ్యంలో ఉన్నా మాస్క్ తప్పనిసరి

ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం బాహుబలి. ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క కీలక పాత్రల్లో నటించారు. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన తొలి తెలుగు చిత్రంగా రికార్టు సృష్టించింది. రాజమౌళి దర్శకత్వ ప్రతిభ, ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, సత్యరాజ్ ల నటన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మాహిష్మతి సామ్రాజ్యం, యాక్షన్ సన్నివేశాలు ఇలా బాహుబలిని రాజమౌళి ఓ విజువల్ వండర్ గా తీర్చిదిద్దారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్ ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు చెబుతూనేవున్నాయి. మాస్క్ ఆవశ్యకతను తెలియజేసేలా, బాహుబలి-2 క్లైమాక్స్ లో ప్రభాస్, రానాలు మాస్కులు ధరించి పోరాడుతున్నట్లు రూపొందించిన వీడియోను రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు. ఓ వీఎఫ్ ఎక్స్ స్టూడియో టీమ్ తయారు చేసిన ఈ వీడియోను షేర్ చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రతి ఒక్కరూ భద్రంగా ఈ విధంగా నిబంధనలు పాటిస్తారని భావిస్తున్నా అని రాజమౌళి పేర్కొన్నారు. మాహిష్మతిలో ఉన్నా మాస్క్ తప్పనిసరి మర్చిపోవద్దు అని వీడియోలో సందేశం ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాల వేధికగా ఆకట్టుకుంటోంది.

మరోవైపు రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ పనుల్లో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడటంతో తిరిగి షెడ్యూల్ ను ఎలా ప్రారంభించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు. ఎన్ టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.