సినిమా నా మనసుకెంతో నచ్చింది..
లాక్డౌన్ కారణంగా సెలబ్రిటీలు తీరికగా తమకు నచ్చిన సినిమాలు కొత్త కొత్త సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. సినిమా నచ్చితే సోషల్ మీడియా ద్వారా సదరు మూవీ టీమ్ను అభినందిస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘బ్లఫ్ మాస్టర్’ సినిమా చూసి హీరో సత్యదేవ్, దర్శకుడు గోపి గణేష్లను ఇంటికి పిలిచి అభినందించిన సంగతి తెలిసిందే. సత్యదేవ్ ఇంకా చిరుని కలిసిన షాక్ నుంచి బయటకు రాలేదు కానీ ఇంతలో మెగా పవర్స్టార్ రామ్ చరణ్ నుంచి మరో ప్రశంస లభించడంతో అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
సత్యదేవ్, హరి చందన, రూప హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’. ఆర్కా మీడియావర్క్స్, మహాయాణ పిక్చర్స్ పతాకాలపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, విజయ ప్రవీణ పరుచూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘కేరాఫ్ కంచరపాలెం’ ఫేమ్ వెంకట్ మహా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రీసెంట్గా విడుదలై సూపర్హిట్ టాక్ను సొంతం చేసుకుంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకులను ఈ చిత్రం దక్కించుకుంది. తాజాగా ఈ సినిమాను చూసిన రామ్చరణ్ తేజ్ చిత్ర యూనిట్కు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.
‘‘రీసెంట్గా నేను చూసిన చిత్రాల్లో ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ నా మనసుకెంతో నచ్చింది. అద్భుతమైన కంటెంట్తో ఈ చిత్రాన్ని రూపొందించారు. సత్యదేవ్, నరేశ్ గారు, సుహాస్, హరి చందన, రూప తదితరుల నటన నన్నెంతగానో ఆకట్టుకుంది. నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ, విజయ ప్రవీణ పరుచూరి గారు సహా ఎంటైర్ యూనిట్కు అభినందనలు’’ అంటూ ట్వీట్ చేశారు రామ్ చరణ్.