అక్షయ్‌తో సహా 45 మందికి కరోనా పాజిటివ్

అక్షయ్‌తో సహా 45 మందికి కరోనా పాజిటివ్

Ram Setu 45 Junior Artistes Diagnosed Covid Positive

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ అక్షయ్ స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. రిపోర్ట్ పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు. తాను హోమ్ ఐసొలేషన్ లోకి వెళ్లానని అక్షయ్ వివరించారు. తనను కలిసిన వాళ్ళు కరోనా పరీక్ష చేయించుకోవాలని కోరారు.

ఇక ఇదిలా ఉంటే ఏప్రిల్ 5 నుంచి రామ సేతు సినిమా షూటింగ్ జరగాల్సి ఉంది. ఈ సినిమాలో అక్షయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్ర నిర్మాత విక్రమ్ మల్హోత్రా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న 100 మంది జూనియర్ ఆర్టిస్టులను పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కాగా వీరిలో 45 మందికి కరోనా నిర్దారణ అయినట్లు సమాచారం. దీంతో సినిమా షూటింగ్ నిలిచిపోయింది. మరో 15 రోజులు అయితే కానీ షూటింగ్ పై నిర్ణయం తీసుకోలేమని నిర్మాత విక్రమ్ తెలిపారు.

ఇక కరోనా బారినపడిన అక్షయ్, గతంలో అనేక సార్లు పరీక్షలు చేయించుకున్నారు. తాజాగా జరిపిన పరీక్షల్లో కరోనా నిర్దారణ అయింది. అక్షయ్ కరోనా గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ అనేక కార్యక్రమాలు చేశారు. వీడియోలు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతేడాది కరోనా కట్టడికోసం తన వంతు సాయంతం ప్రధాన మంత్రి సహాయ నిధికి 25 కోట్లు విరాళం అందించారు.

మరో వైపు మహారాష్ట్రలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఆదివారం 57,074 మంది కరోనా బారినపడినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక ఇక్కడ లాక్ డౌన్ విధించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.