జీబ్రిష్ రామలింగయ్య..

  • Published By: sekhar ,Published On : July 31, 2020 / 02:52 PM IST
జీబ్రిష్ రామలింగయ్య..

తెలుగు సినిమాకు దొరికిన అపురూపమైన కళాకారుడు అల్లు రామలింగయ్య. ఊరు పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు. చూసింది చూసినట్టు అనుకరించడం రామలింగయ్య ప్రత్యేకత. ఇలా చిన్నప్పుడు అందరినీ అనుకరిస్తూ నవ్విస్తూ ఉండేవారు. అలా ఓ సెలబ్రిటీ అయిపోయారు. ఓ సారి వాళ్ల ఊళ్లో ‘భక్త ప్రహ్లాద’ నాటకం చూస్తుండగా.. బృహస్పతి వేషం వేస్తున్న కుర్రాడు బాగా చేయడం లేదనిపించి…కాంట్రాక్టరుకు మూడు రూపాయలు ఎదురిచ్చి ఆ వేషం తనేసిన తపన ఉన్న కళాకారుడు. ఇవాళ అల్లు రామలింగయ్య 16వ వర్థంతి.



అల్లు రామలింగయ్య నాటకాలు చూసిన గరికపాటి రాజారావు సినిమాల్లోకి వస్తావా అని అడిగారు. సరే అన్నారు అల్లు. అలా ‘పుట్టిల్లు’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. అందులో పెళ్లిళ్ల పేరయ్య పాత్రతో ఇండస్ట్రీని ఎట్రాక్ట్ చేశారు.
అల్లుకు కళలతో పాటు నాటి స్వతంత్ర పోరాటంలో పాల్గోవడం కూడా ఇష్టమే. అలా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు కూడా వెళ్లారు. విడుదలైన తర్వాత చాలా కాలానికి సినిమాల్లోకి ప్రవేశించారు. ‘పుట్టిల్లు’ తర్వాత హెచ్.ఎమ్.రెడ్డి గారి ‘వద్దంటే డబ్బు’లో నటించారు.

‘పుట్టిల్లు’ చిత్రం నిర్మాణకాలంలోనే కుటుంబాన్ని మద్రాసుకు మార్చారు. కుటుంబ పోషణకు చాలా కష్టాలు పడ్డారు. నెమ్మదిగా వేషాలు పెరిగాయి. ‘అప్పు చేసి పప్పుకూడు, మాయాబజార్, దొంగరాముడు, మూగమనసులు’ లాంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు వచ్చాయి. నెమ్మదిగా నటుడుగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పనిలేకుండా పోయింది.



మొదట్లో కామెడీ వేషాలే చేసినా…నెమ్మదిగా కామెడీ విలనీ కూడా చేయడం ప్రారంభించారు. ఓ టైమ్‌లో విలన్ వెనకాల ఉండే ఓ తరహా గుంటనక్క లాంటి పాత్రలో అల్లు రామలింగయ్య ఎక్కువగా కనిపించేవారు. రెగ్యులర్‌గా చేసే ఆ పాత్రలోనే తనదైన మార్క్ నటనతో గుర్తింపు తెచ్చుకునేవారు.
అదే తరహా పాత్రలు ఆయన చివరి దశలోనూ చేశారు. ప్రతి సినిమాలోనూ అల్లు రామలింగయ్య, సత్యనారాయణ, రావుగోపాలరావులు సమిష్టి విలనీ చేసేవారు.

అల్లు రామలింగయ్యలో ఉన్న నటుడ్ని అద్భుతంగా వాడుకున్న దర్శకుల్లో విశ్వనాథ్ ఒకరు. ఆయన తీసిన చాలా సినిమాల్లో అల్లు కచ్చితంగా ఉండేవారు. పైగా ఓ ప్రత్యేక పాత్రలో అల్లును ప్రవేశపెట్టేవారు విశ్వనాథ్.
అలా చేసిన చిత్రాలే…‘శంకరాభరణం, సప్తపది’.. రెండు చిత్రాల్లోనూ విచిత్రంగా జె.వి.సోమయాజులు స్నేహితుడుగానే నటించారు అల్లు. ‘శంకరాభరణం’లో శంకరశాస్త్రి స్నేహితుడుగా అల్లు నటన చాలా హృద్యంగా ఉంటుంది. ‘సప్తపది’లో రాజులుగా కాస్త గంభీరంగా సాగుతుంది. ‘‘మీరు యాజులు.. మేం రాజులూ’’ అనే డైలాగు చాలా అద్భుతంగా చెప్తారాయన.



అల్లు రామలింగయ్య మాత్రమే చేయగల పాత్ర ‘యమగోల’లో చిత్రగుప్తుడి పాత్ర..అటు యమలోకంలో కేసుల లిస్టు చదివే సీన్స్‌లోనూ అలాగే భూలోకంలోకి వచ్చిన తర్వాత యముడి ముందు లౌక్యం ప్రదర్శించే సీన్స్‌లో అల్లు రామలింగయ్య నటన నభూతో అన్న రేంజ్‌లో సాగుతుంది. ఆ తర్వాత చాలా మంది ట్రై చేశారుగానీ…అల్లు సమీపంలోకి రాలేకపోయారు.

అల్లు రామలింగయ్య నటించిన వెయ్యికి పైగా సినిమాల్లో పోషించిన పాత్రలన్నీ ఒకెత్తు…‘ముత్యాలముగ్గు’లో చేసింది ఒక్కటే ఒకెత్తు. ఎస్టేట్ మేనేజర్‌గా పరమ దగుల్బాజీ పాత్రలో జీవించిన అల్లు రామలింగయ్య నటుడుగా మాత్రం తన ప్రత్యేకతను చాటుకున్నారు. కోతి కరిచిన తర్వాత సీన్స్‌లో అల్లు నటన అసాధారణం. ఆ సీన్స్ చిత్రీకరణలో కొడుకు చనిపోయాడని కబురొచ్చినా…కంప్లీట్ చేసే వెళ్లారాయన. అంతటి అంకితభావం ఆయనది.



అల్లు రామలింగయ్యలో చిన్నతనం నుంచి ఓ మిమిక్రీ కళాకారుడు ఉన్నాడు. ఈ కళను ఆయన చాలా పదిలంగా కాపాడుకుంటూనే వచ్చారు. మిమిక్రీలో జీబ్రిష్ ఒక భాగం. అంటే…తమిళం మాట్లాడుతున్నట్టే ఉంటుంది కానీ అందులో ఒక్క తమిళ ముక్క ఉండదు. అలాగే హిందీనో…ఇంగ్లీషో మాట్లాడుతున్నట్టే ఉంటుంది. కానీ అందులో ఆ భాషలకు సంబంధించిన విషయం ఏమీ ఉండదు.
అల్లు వారిలో ఈ కళ ఉందనే విషయం చాలా మందికి తర్వాత తెల్సిందిగానీ…దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి చాలా కాలం క్రితమే తెల్సు. క్రాంతికుమార్ బ్యానర్‌లో తను తీసిన ‘కల్పన’లో ఓ సన్నివేశం కోసం అల్లు రామలింగయ్యతో మొదటి సారి జీబ్రిష్ మాట్లాడించారు.

మళ్లీ జంధ్యాల తన ‘రెండు జళ్ల సీత’ కోసం మరోసారి జీబ్రిష్ మాట్లాడించారు. ఇందులో అల్లు రామలింగయ్య హిందీలా భ్రమింపచేస్తూ మాట్లాడతారు. దీనికో కనెక్టింగ్ డైలాగు కూడా రాశారు జంధ్యాల. మా బావ హిందీ తట్టుకోలేక…ముంబై జనాలందరూ చందాలేసుకుని మరీ ఇక్కడికి తోలేశారని అల్లు బావమరిది కారక్టర్‌తో చెప్పిస్తారు. సుమారు 1030 సినిమాల్లో కామెడీ విలనీ, క్యారెక్టర్ పాత్రలు చేసారు రామలింగయ్య. 1116 చిత్రాల్లో నటించాలనే కోరిక మాత్రం తీరకుండానే వెళ్లిపోయారు. రేలంగి తరువాత ‘పద్మశ్రీ’ అందుకున్న హాస్యనటుడుగా చరిత్ర సృష్టించారు.



2004 జూలై 31 వ తేదీన తన 82 వ ఏట ప్రశాంతంగా కన్నుమూశారు.
అనేక ప్రత్యేకతలున్న మోస్ట్ పవర్‌ఫుల్ క్యారెక్టర్ యాక్టర్‌గా అల్లు రామలింగయ్య తెలుగు సినిమా ఉన్నంత వరకు జ్ఞాపకం ఉండిపోతారు.
రామలింగయ్య గారి వయసు ఎనభై దాటేసిన తర్వాత ఓ సినిమాలో క్యారెక్టర్ కోసం ఒక దర్శకుడు అప్రోచ్ అయితే…అల్లు అరవింద్ వద్దన్నారు. ఈ ఏజ్‌లో ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఎందుకండీ ఎవరితోనైనా వేయించేయండి.. అని బ్రతిమాలి పంపేశారు. ఈ విషయం తెలిసిన అల్లు రామలింగయ్య గారు అరవింద్ గారితో పెద్దగా గొడవేసుకున్నారట…నా బొచ్చెలో రాయేస్తావా అని నిలదీశారట .. అలా అంతగా నటనకు అంకితమైపోయిన నటుడాయన.