Acharya: ఆచార్యలో పాటపై మంత్రికి మెమోరండం ఇచ్చిన ఆర్ఎంపీ డాక్టర్లు
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’.
Acharya: మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ క్రేజీ కాంబినేషనల్లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా.. లేటెస్ట్గా సినిమాకు సంబంధించి ఓ సాంగ్ని విడుదల చేసింది చిత్రయూనిట్. అయితే, ఆ సాంగ్ ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది.
ఈ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం పోలీసులను ఆశ్రయించగా.. వారే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ని కూడా కలిశారు. ‘సానా కష్టం అంటూ సాగే ఈ పాట లిరిక్స్ తమ మనోభవాలు దెబ్బతీసేలా ఉందంటూ ఆర్ఎంపీ డాక్టర్ల సంఘం మంత్రికి మెమోరండం ఇచ్చింది.
పాటలో ఒక చోట ‘యాడాడో నిమరొచ్చని కుర్రాళ్లంతా ఆర్ఎంపీలు అయిపోతున్నారే..’ అని ఉంది. తెలంగాణ రాష్ట్ర గ్రామీణ వైద్యుల సమాఖ్య అధ్యక్షుడు పంగమల్లేషం మాట్లాడుతూ.. సినిమా దర్శకుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.