Hyderabad Floods: సంపూర్ణేష్ బాబు విరాళం..

  • Published By: sekhar ,Published On : October 21, 2020 / 05:59 PM IST
Hyderabad Floods: సంపూర్ణేష్ బాబు విరాళం..

Hyderabad Floods – Sampoornesh Babu: ‘బర్నింగ్‌స్టార్’ సంపూర్ణేష్ బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. హైదరాబాద్ వరద బాధితులకు తనవంతు సాయంగా 50 వేల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తెలంగాణ మంత్రి హరీష్ రావును తన ఇంట్లోనే కలిసి ఆయన ఈ చెక్ అందజేశారు. సంపూర్ణేష్ చేసిన సాయాన్ని మంత్రి కూడా ప్రశంసించారు.


ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కూడా నేనున్నాను అంటూ తనవంతుగా ఎంతోకొంత సాయం చేస్తూనే ఉంటారు సంపూ. ఇప్పుడు కూడా తన వంతు సాయం చేశారు. అనుకోకుండా వచ్చిన భారీ వర్షాలు హైదరాబాద్‌ను అతలాకుతలం చేశాయి. ఈ వరదల్లో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఇదంతా చూసి తన గుండె కరిగిపోయిందని తెలిపారు సంపూర్ణేష్ బాబు. ఉడతా భక్తిగా తాను ఈ 50 వేల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందజేస్తున్నట్లు తెలిపారు.


Sampoornesh Babu

లాక్‌డౌన్ కారణంగా ఎలాంటి సినిమాలు.. షూటింగ్స్ లేకపోయినా కూడా సంపూర్ణేష్ బాబు ఆర్థిక సాయం చేయడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోంది. మొన్న లాక్‌డౌన్ సమయంలో కూడా తెలుగు సినీ కార్మికులకు లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు సంపూ. షూటింగ్స్ లేకపోవడంతో ఇంటిదగ్గరే ఉంటూ ఎంతో నిరాడంబరంగా తన కులవృత్తిని చేసుకున్నారాయన. సెలబ్రిటీ హోదా ఉన్నా అవేం పట్టించుకోకుండా సాధారణంగా ఉండటమే సంపూర్ణేష్ బాబును ప్రేక్షకులకు మరింత చేరువ చేస్తుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.