సంజయ్ దత్ జీవితంలో ప్రశాంతత లేదా? మూడో దశలో క్యాన్సర్
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్కు ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్కు క్యాన్సర్ మూడో దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సంజయ్కు వైద్యులు కొన్ని పరీక్షలు చేయగా.. వాటిలో ఆయనకు క్యాన్సర్ అన్న విషయం బయటపడింది. అది కూడా స్టేజ్ -3 లో ఉండడంతో.. చికిత్స నిమిత్తం త్వరలోనే యూఎస్కు వెళ్లనున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.
ఇటీవల శ్వాస సంబంధిత సమస్యలు, ఛాతీలో నొప్పితే ముంబైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన సంజయ్ దత్ మూడు రోజులు చికిత్స తీసుకొని అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయంలో వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా.. నెగెటివ్ వచ్చినట్లు సంజయ్ వెల్లడించారు. అలాగే తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎలాంటి ఆందోళన చెందవద్దని అభిమానులను ట్విట్టర్ ద్వారా కోరారు. సినిమా షూటింగ్ల నుంచి కూడా కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటున్నట్లు సంజయ్ ప్రకటించారు.
సంజయ్ దత్ తల్లి.. ప్రముఖ బాలీవుడ్ నటి నర్గీస్ కూడా క్యాన్సర్తోనే చనిపోయారు. ఆమెకు పాంక్రియాటిక్ కాన్సర్ సోకింది. దానితో పోరాడుతూ ఆమె చాలా కాలం ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. అనంతరం 1981లో కన్నుమూశారు. సంజయ్ కూడా తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. చిన్నతనం నుంచే సంజయ్ మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డట్టు ఆయన బయోపిక్ సంజులో చూపించారు.
ముంబై పేలుళ్ల కేసుకు సంబంధించి సంజయ్ జైలుకు కూడా వెళ్లారు. ఈ మధ్యే ప్రశాంతమైన జీవితం గడుపుతున్న అతనికి క్యాన్సర్ రూపంలో మరో కష్టమొచ్చి పడింది. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత పేరు ఉన్నా.. సంజయ్ జీవితంలో మాత్రం ప్రశాంతత లేదని అభిమానులు చెబుతుంటారు. ఇక సంజయ్ ప్రస్తుతం ‘కేజీఎఫ్ చాఫ్టర్ 2’, ‘శమ్ షేరా’ చిత్రాల్లో నటిస్తున్నారు. ఆయన నటించిన ‘సడక్ -2’, ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి.