శేఖర్ కమ్ముల తండ్రి శేషయ్య కన్నుమూత
ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) కన్నుమూశారు. ఆయన గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధింత సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొద్దికాలంగా ఇంటి వద్దే చికిత్స అందిస్తున్నారు. ఇటీవల ఆరోగ్యం క్షీణించడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ శనివారం ఉదయం 6 గంటలకు మరణించారు అని సన్నిహితులు తెలిపారు.
శనివారం సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. శేఖర్ కమ్ముల లాక్డౌన్ సమయంలో కరోనా వారియర్స్తో మాట్లాడుతూ ప్లాస్మా దానం చేయాలని అవగాహన కల్పిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా ‘లవ్స్టోరి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. సినీ రంగానికి చెందిన పలువురు సోషల్ మీడియా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.