రియా తన జీవితంలోకి రాకముందే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు!

  • Published By: vamsi ,Published On : September 6, 2020 / 08:32 AM IST
రియా తన జీవితంలోకి రాకముందే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడు!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డ్రగ్స్ తీసుకునేవాడని షావిక్ చక్రవర్తి తరపు న్యాయవాది సతీష్ మన్‌షిందే శనివారం కోర్టుకు వెల్లడించారు. సుశాంత్‌కు 20 సంవత్సరాల వయస్సు నుండే మానసిక సమస్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. రియా, షౌవిక్ ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదని, వారిద్దరూ రక్త పరీక్షలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మన్‌షిందే కోర్టులో తెలిపారు.

ఎన్‌సిబి షావిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరాండా, జైద్ విలాత్రా, కైజాన్‌లను ఎన్‌డిపిఎస్ కోర్టులో హాజరుపరచగా.. కోర్టు షౌవిక్, శామ్యూల్‌లను నాలుగు రోజుల పాటు రిమాండ్‌కు పంపింది. రియా తరపు న్యాయవాది సతీష్ మన్‌షిందే కోర్టులో షౌవిక్ చక్రవర్తి తరఫున వాదించారు.

కేదార్‌నాథ్ చిత్రం షూటింగ్ సమయంలో కూడా సుశాంత్ డ్రగ్స్ తీసుకున్నట్లు విచారణ సందర్భంగా సతీష్ మన్‌షిందే కోర్టుకు తెలిపారు. సుశాంత్ జీవితంలో రియా రాకముందే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పారు.

సోదరి ప్రియాంక సలహా మేరకు సుశాంత్ డాక్టర్లు సూచించని మందులు తీసుకునేవాడని మన్‌షిందే చెప్పుకొచ్చారు. డాక్టర్లు సూచించని మందులు తీసుకునే విషయంలో రియా, సుశాంత్ మధ్య తేడాలు ఉన్నాయని కూడా ఆయన కోర్టుకు చెప్పారు. షావిక్ చక్రవర్తి దగ్గర ఎలాంటి డ్రగ్స్‌ లేవని, రియా, షావిక్ చక్రవర్తిలపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవమని ఆయన కోర్టుకు వెల్లడించారు.

రియా చక్రవర్తికి సమన్లు ​​పంపమని ఎన్‌సిబిని ఎన్‌డిపిఎస్ కోర్టు ఆదేశించగా.. ఎన్‌సిబి ఇప్పుడు రియా చక్రవర్తిని కూడా ప్రశ్నిస్తుంది. షావిక్, శామ్యూల్ మధ్య రియాను ముఖాముఖిగా ప్రశ్నించనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తరువాత వచ్చిన డ్రగ్స్ యాంగిల్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దీపేష్ సావంత్‌ను అరెస్టు చేసింది. దీపీశ్ సావంత్‌ను ఇవాళ(ఆదివారం) ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరుస్తారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో డ్రగ్స్ కోణాన్ని ఎన్‌సిబి దర్యాప్తు చేస్తోంది.