శివసేన “సోనియా సేన”గా మారిపోయింది….కంగనా తీవ్ర వ్యాఖ్యలు
శివసేన పార్టీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మధ్య వివాదం మరింత తీవ్రమై రాజకీయ విమర్శలకు దారితీసింది. శివసేన పార్టీ అధికారం కోసం ‘సోనియా సేన’గా మారిపోయిందని కంగన విమర్శించింది.
శ్రీ బాల్ సాహెబ్ ఠాక్రే స్థాపించిన శివసేన.. ఆయన భావజాలాన్ని పక్కనపెట్టి, అధికారం కోసం సోనియా సేనగా మారిపోయింది. నేను లేనప్పుడు నా ఇంటిని కూల్చిన గుండాలను మున్సిపల్ విభాగం అనొద్దు. అలా అని రాజ్యాంగాన్ని అవమానించవద్దు అని కంగనా ట్వీట్ చేసింది.
కాగా, ముంబై బాంద్రాలోని నటి కంగన భవంతి అక్రమ నిర్మాణమంటూ… ఆమెకు ముంబై మున్సిపల్ కార్పొరేషన్ మంగళవారం నోటీసులు అందజేసింది. కూల్చివేత పనులు బుధవారం బీఎంసీ ప్రారంభించగా.. కంగనా తరపు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర వ్యాజ్యాన్ని పరిశీలించిన న్యాయస్థానం.. కూల్చివేతపై స్టే విధించిన విషయం తెలిసిందే. .
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై తీవ్రంగా స్పందించిన కంగనా.. ‘‘ఈరోజు నా ఇంటిని కూల్చారు. రేపు మీ అహంకారం కూలుతుంది’’ అంటూ మండిపడ్డారు.
బీఎంసీ తీరుపై గవర్నర్ అసహనం
మరోవైపు, కంగనా రనౌత్ ఇంటిని కూల్చివేసిన ఘటనలో మహారాష్ట్ర గవర్నర్ భగత్సింగ్ కొశ్యారీ.. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్కు సంబంధించిన వివాదం గురించి కేంద్రానికి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారుకు గవర్నర్ సమన్లు జారీచేసినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
కంగనా ఇంటికి ముంబై పోలీసుల భద్రత
https://10tv.in/kangana-ranaut-to-be-provided-y-category-security/
సబర్బన్ బాంద్రాలోని కంగనా నివాసానికి ముంబయి పోలీసులు భద్రత కల్పించారు. బుధవారం హిమాచల్ ప్రదేశ్ నుంచి ముంబైకి కంగనా చేరుకున్న విషయం తెలిసిందే. ఆమె ఇంటివద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఓ పోలీసు వ్యాన్తో పాటు మహిళా కానిస్టేబుల్స్ను నియమించినట్లు పోలీసు అధికారి తెలిపారు.
అప్పటి నుంచే శివసేన-కంగనా వివాదం
సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన నాటి నుంచి కంగనా రనౌత్, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మాఫియా కన్నా ముంబయి పోలీసుల వల్లే ఎక్కువగా భయపడుతున్నానని ఈ మధ్యే కంగన చెప్పింది. దీంతో శివసేన నేత సంజయ్ రౌత్, ఆమెను ముంబై రావొద్దంటూ బహిరంగంగానే చెప్పారు.
దీనిపై స్పందించిన కంగన.. ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోలుస్తూ ట్వీట్ చేసింది. తద్వారా ఈ వివాదం మరింత వేడెక్కింది. ఆమె ప్రాణాలకు ముప్పుందని హిమాచల్ ప్రదేశ్, కేంద్రానికి విన్నవించుకున్న క్రమంలో ఆమెకు వై-ప్లస్ కేటగిరీ సెక్యూరిటీని నియమించింది కేంద్రం.ఈ క్రమంలోనే ముంబై కి వస్తానని వీలైతే ఆపుకోమని సవాలు విసిరారు కంగన. బుధవారం చెప్పిన మాట ప్రకారం ముంబైలో అడుగుపెట్టింది. .