నిర్మాతగా మెగా డాటర్.. బర్త్‌డే సందర్భంగా మోషన్ పోస్టర్..

  • Published By: sekhar ,Published On : August 22, 2020 / 02:06 PM IST
నిర్మాతగా మెగా డాటర్.. బర్త్‌డే సందర్భంగా మోషన్ పోస్టర్..

Sushmita Konidela Production: మెగాభిమానులకు ఆగస్టు 22న పెద్ద పండగ. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటారు ఫ్యాన్స్. ఈ ఏడాది పుట్టినరోజున మెగాస్టార్ పెద్ద కుమార్తె అభిమానులకు ఓ కానుక ఇచ్చారు. భర్తవిష్ణు ప్రసాద్‌తో కలిసి నిర్మిస్తున్న వెబ్ సిరీస్ ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు సుస్మిత.



‘సైరా నరసింహారెడ్డి’ సహా పలు చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసిన మెగాస్టార్ చిరంజీవి తనయ సుష్మితా కొణిదెల, ఆమె భర్త విష్ణుప్రసాద్ ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు. నిర్మాతగా డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్‌/ఓటీటీ రంగంలోకి తొలి అడుగులు వేస్తున్నారు. జీ 5 అసోసియేష‌న్‌తో ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి ‘షూట్-అవుట్ ఎట్ ఆలేరు’ టైటిల్ ఖరారు చేశారు.

మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రెగ్యులర్ మోషన్ పోస్టర్స్ టైపులో కాకుండా స్టోరీ టెల్లింగ్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం విశేషం.

ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ ప్రధాన పాత్రధారులుగా ఆనంద్ రంగా దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోంది. వాస్తవ ఘటనల ఆధారంగా టెర్రరిస్ట్ నేపథ్యంలో 8 ఎపిసోడ్స్‌తో కూడిన ఒక క్రైమ్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు. ‘ఓయ్’ సినిమా తరవాత ఆనంద్ రంగా దర్శకత్వం వహిస్తున్న సబ్జెక్టు ఇదే. హైదరాబాద్‌లోని కొందరు పోలీసులు, కొంతమంది కరుడుగట్టిన నేరస్తుల కథల ఆధారంగా వాస్తవ ఘటనల ప్రేరణతో ఈ వెబ్ సిరీస్ రూపొందుతోందని, అదే కాన్సెప్ట్ అని యూనిట్ తెలిపింది.



నిర్మాత శ్రీమతి సుష్మితా కొణిదెల మాట్లాడుతూ.. ”నేను ప్రొడక్షన్ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వెబ్ సిరీస్ నా తొలి అడుగు. నాన్నగారి పుట్టినరోజున మా వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అభిమానులకు ఇది నచ్చిందని అనుకుంటున్నా. మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాను. త్వరలో సిరీస్ విడుదల తేదీ వెల్లడిస్తాం” అని అన్నారు.