ఐసీయూలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.. MGM హాస్పిటల్ అధికారిక ప్రకటన..
ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందనే వార్తతో సినీ పరిశ్రమ ఆందోళనకు గురైంది. కరోనా లక్షణాలతో ఈనెల 5న బాలు ఆసుపత్రిలో చేరారు. పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో అప్పటినుంచి చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. నిన్న రాత్రి నుంచి ఆరోగ్యం విషమంగా ఉండడంతో ప్రస్తుతం ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు వైద్యులు..
బాలు హెల్త్ కండీషన్ క్రిటికల్గా ఉందంటూ ఎంజీఎం హాస్పిటల్ వారు అధికారికంగా ప్రకటించడంతో తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో అలజడి నెలకొంది. మైల్డ్ కరోనా ఉన్నట్లుగా తేలితే ఇంట్లోవాళ్లని ఇబ్బంది పెట్టడం కంటే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం మంచిది అని ఆసుపత్రిలో జాయిన్ అయినట్లుగా బాలు ఇటీవలే ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయన త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తూ పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.