సోనూసూద్ అపరభగీరథుడు, ప్రజల దప్పికను తీర్చిన హీరో
Sonu Sood: బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరోసారి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నారు. తీవ్ర నీటి ఎద్దడితో వెతలు అనుభవిస్తున్న ఓ గ్రామ ప్రజల పాలిట అతడు అపర భగీరథుడయ్యాడు. చేతి పంపులు బిగించి అక్కడి ప్రజల దప్పికను తీర్చి వారి గుండెల్లో చోటు సంపాదించుకున్నారు ఈ నిజమైన హీరో.
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ పరిధిలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి.. తమ గ్రామంలో నీటి సమస్య ఉందంటూ సోనూసూద్ను సంప్రదించాడు. దీనికి స్పందించిన సోనూ.. గ్రామంలో చేతి పంపులు బిగించాడు. ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఉందని, తాగునీటి కోసం కిలోమీటర్ల మేర నడుస్తున్నామని అక్కడి వారు చెప్పడంతో పంపులు ఏర్పాటు చేశాడు. దీంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఇంత చేసినా ఆ గ్రామానికి ఒక్కసారి కూడా వెళ్లలేదు సోనూసూద్. ఏదో ఒక రోజు ఆ గ్రామానికి వెళ్లి ఆ పంపులో వచ్చే మంచి నీటిని తాగుతానని ఆయన తెలిపాడు.
కరోనా కష్ట కాలంలోనూ సోనూ పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఇటీవల ఉత్తరాఖండ్ వరదల్లో మృతి చెందిన ఓ వ్యక్తి కుటుంబానికి సైతం తన వంతు సాయం అందించాడు ఈ రియాల్టీ హీరో. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతున్న ఆచార్యలో సందడి చేయనున్నాడు. ఈ.నివాస్ దర్శకత్వంలో రాబోతున్న కిసాన్ చిత్రానికి కూడా సోనూ ఓకే చెప్పేశాడు.