నో ఆప్షన్.. రెండు భారీ సినిమాలు కూడా ఓటీటీ దారిలోనే..
Sooryavanshi and 83 will Release on OTT: కరోనా లాక్డౌన్ సమయంలో సినిమా థియేటర్స్ మూతపడ్డాయి. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం థియేటర్స్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో దర్శక నిర్మాతలు చాలా మంది వారి సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తూ వస్తున్నారు.
అయిదారు నెలలుగా థియేటర్స్ కోసం వేచి చూస్తున్న స్టార్ చిత్రాలు కూడా ఓటీటీల బాట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బడ్జెట్తో రూపొందిన బాలీవుడ్ భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాలు కూడా ఓటీటీలో విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
వివరాల్లోకెళ్తే.. ‘సూర్యవంశీ’, ‘83’ చిత్రాలను ఈ ఏడాది దీపావళి, క్రిస్మస్కి విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, థియేటర్స్ విషయంలో క్లారిటీ రాలేదు. ఈ విషయంలో రిలయన్స్ సీఈఓ శిభాషిస్ సర్కార్ స్పందిస్తూ ‘‘మేం వందశాతం థియేటర్లలోనే మా ‘సూర్యవంశీ’, ‘83’ సినిమాలను విడుదల చేయాలనుకుంటున్నాం. అయితే ఎంత వరకు సాధ్యమో అంత వరకే వెయిట్ చేస్తాం. వీడియో ఆన్ డిమాండ్, పే ఫర్ వ్యూ.. ఇలా అనేక రకాల మార్గాలను ఆలోచిస్తున్నాం. మేం అనుకున్న తేదీలు దాటితే కనుక సినిమాల విడుదలను వాయిదా వేయలేం’’ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ రెండు హిందీ సినిమాలు త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయనేది ట్రేడ్ వర్గాలవారి మాట. ‘సూర్యవంశీ’ చిత్రానికి రోహిత్ శెట్టి, ‘83’ చిత్రానికి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు.