బాలసుబ్రహ్మణ్యం భార్యకూ కరోనా పాజిటివ్‌..

  • Published By: sekhar ,Published On : August 15, 2020 / 08:59 PM IST
బాలసుబ్రహ్మణ్యం భార్యకూ కరోనా పాజిటివ్‌..

ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్య సావిత్రికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిసింది. ఆమెను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ నెల 5న ఎస్పీబీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం అర్థరాత్రి ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఐసీయూకు తరలించి చికిత్సనందిస్తున్నారు.

శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సనందిస్తున్నట్లు ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు ఎస్పీబీ ఆరోగ్యంపై అధికారిక హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశాయి. దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

అయితే.. ‘‘నాన్నగారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎవరూ కంగారు పడకండి. త్వరితగతిన నాన్నగారు కోలుకుంటారు..’’ అని ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం కుమారుడు చరణ్ ప్రకటించడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. తెలుగు, తమిళ్ సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా బాలు గారు త్వరగా కోలుకోవాలంటూ పోస్టులు చేస్తున్నారు.