‘ఎక్మో’.. ఇదే ఇప్పుడు బాలుకు ప్రాణ రక్షణ..

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 11:30 PM IST
‘ఎక్మో’.. ఇదే ఇప్పుడు బాలుకు ప్రాణ రక్షణ..

SPB Health Condition Critical: గత 24 గంటలుగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం క్రమేపీ క్షీణిస్తూ వస్తోంది. ప్రస్తుతం పరిస్థితి విషయంగానే ఉంది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సనందిస్తున్నాం అని ఆసుపత్రి వర్గాలు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేయడంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది.

ప్రస్తుతం బాలుకు ఎక్మో ద్వారా చికిత్సనందిస్తున్నారు. చాలా రోజులుగా అస్వస్థత నుంచి కోలుకుంటున్న వ్యక్తికి సడన్‌గా గుండె, ఊపిరి తిత్తులు పని చేయని పక్షంలో అత్యవసరంగా ‘ఎక్మో’ యంత్రం మీద ఉంచి కొన్ని గంటల పాటు చికిత్స అందిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే ఇది ఆపదలో ఉన్న రోగికి ప్రాణరక్షణ లాంటిది. ఈ వైద్యాన్ని 2016లో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు అందించారు. ఇప్పుడు బాలుకు అందిస్తున్నారు.


పేషెంట్‌ శరీరంలోని గుండె, ఊపిరి తిత్తుల పనిని బయటి నుంచే ఈ యంత్రం నిర్వహిస్తుంది. అత్యంత విషమ పరిస్థితుల్లోనే దీన్ని ఉపయోగిస్తారు. ఎస్పీ బాలుకి కూడా మొదట్లో సాధారణ పేషెంట్‌ మాదిరిగానే వెంటిలేటర్‌పై చికిత్స అందించారు.

వెంటిలేటర్‌పై రోగిని ఉంచినపుడు ఊపిరి తిత్తులు కొంతైనా పని చేస్తున్నప్పుడే దాని వల్ల ప్రయోజనం ఉంటుంది. బాలు విషయంలో వెంటిలేటర్‌ వల్ల సరైన రిజల్ట్ రాకపోవడంతో వైద్యులు ఈ ఎక్మో యంత్రం ద్వారా ఆయనకు ప్రాణరక్షణ కల్పిస్తున్నారు. మరి కాసేపట్లో బాలు ఆరోగ్యం గురించి ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది.