సుశాంత్ జీవిత స్ఫూర్తితో ‘సూసైడ్ ఆర్ మర్డర్’..
బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14 న ముంబైలోని తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా సుశాంత్ జీవితం నుంచి ప్రేరణపొంది, రూపొందిస్తున్న ‘‘సూసైడ్ ఆర్ మర్డర్’’ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ పోస్టర్ బయటకు వచ్చింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత విజయ్ శేఖర్ గుప్తా మీడియాతో మాట్లాడారు.
ఈ చిత్రానికి సంబంధించి 50 శాతం స్క్రిప్ట్ పూర్తయ్యిందన్నారు. సెప్టెంబర్ 16 నుంచి ముంబై, పంజాబ్లలో 50 రోజులపాటు షూట్ చేస్తామన్నారు. బాలీవుడ్లో నెలకొన్న పక్షపాతధోరణి, అపోహలను తొలగించేందుకు ఈ చిత్రం రూపొందుతోందన్నారు. సచిన్ తివారి సుశాంత్ పాత్రలో నటిస్తున్నాడని తెలిపారు. తాను సుశాంత్ పేరును వాడుకునేందుకు ప్రయత్నించడం లేదని, సుశాంత్ లాంటి పరిస్థితి మరొకరికి రాకుండా ఉండాలని కోరుకుంటున్నానన్నారు.
ఈ చిత్రంలో 10 మందికి సంబంధించిన కథలు ఉంటాయని, ఈ చిత్రం సుమారు 3 గంటలు ఉంటుందన్నారు. సుశాంత్ మృతి కేసులో విచారణ ఎదుర్కొంటున్నవారి పాత్రలు కూడా ఈ చిత్రంలో కనిపిస్తాయన్నారాయన. పోస్టర్ రిలీజ్ చేయడంతో బాలీవుడ్ సినీ వర్గాల్లో ‘‘సూసైడ్ ఆర్ మర్డర్’’ హాట్ టాపిక్గా మారింది.