ప్రముఖ తమిళ డైరక్టర్,నటుడు రాజశేఖర్ కన్నుమూత

  • Published By: venkaiahnaidu ,Published On : September 8, 2019 / 12:26 PM IST
ప్రముఖ తమిళ డైరక్టర్,నటుడు రాజశేఖర్ కన్నుమూత

ప్రముఖ తమిళ ఫిల్మ్ డైరక్టర్,నటుడు రాజశేఖర్(62) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని రామచంద్ర హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(సెప్టెంబర్-8,2019)తుదిశ్వాస విడిచారు. రాజశేఖర్ మరణంతో తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

ఆయన మృతిపై విచారం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు. డైరెక్టర్ గా కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఆయన పలైవనచొలై,చిన్నపూవే మెళ్ల పెసు వంటి సూపర్ హిట్ సినిమాలను డెరెక్ట్ చేశారు. అంతేకాకుండా రాజశేఖర్ చెన్నై ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థి కూడా. ఓ నటుడిగా భారతీరాజా దర్శకత్వం వహించిన నిజాల్గల్ (1980) సినిమాతో రాజశేఖర్ తెరంగేట్రం చేశారు. 

గత ఏడాది డిసెంబర్‌లో కన్నుమూసిన రాబర్ట్‌ ఆశీర్వాధమ్ తో కలిసి రాజశేఖర్ తమిళ చిత్ర పరిశ్రమను కొత్త పుంతలు తొక్కించాడు. ఒరు తలై రాగం, పలైవనచొలై, చిన్నపూవ్ వంటి హిట్ సినిమాల్లో కలిసి పనిచేశారు. పలు తమిళ టీవీ సిరీయల్స్ లో కూడా ఆయన నటించారు. తెలుగులో కూడా బామ్మ మాట బంగారు బాట వంటి పలు సినిమాల్లో రాజశేఖర్ నటించారు.