శత్రువులా, ఆకతాయిలా? ఇంట్లోకి చొరబడి మోహన్ బాబు కుటుంబసభ్యులను బెదిరించిన దుండగులు ఎవరు?

  • Published By: naveen ,Published On : August 2, 2020 / 09:00 AM IST
శత్రువులా, ఆకతాయిలా? ఇంట్లోకి చొరబడి మోహన్ బాబు కుటుంబసభ్యులను బెదిరించిన దుండగులు ఎవరు?

సినీ నటుడు మోహన్‌బాబు ఫాం హౌస్‌ దగ్గర కలకలం రేగింది. ఓ కారులో వచ్చిన కొందరు దుండగులు హల్ చల్ చేశారు. జల్పల్లిలోని మోహన్ బాబు ఫాం హౌస్‌లోకి కారుతో అక్రమంగా చొరబడిన దుండగులు, మిమ్మల్ని వదలం అంటూ మోహన్ బాబు కుటుంబ సభ్యులను బెదిరించి వెళ్లారు. దీంతో వారు పహాడిషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. AP 31AS 0004 ఇన్నోవా కారులో దుండగులు వచ్చినట్లు మోహన్‌బాబు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం (ఆగస్టు 1,2020) రాత్రి జరిగింది.

కొందరు దుండగులు తన ఫాంహౌస్‌లోకి ఇన్నోవా కారుతో అక్రమంగా చొరబడ్డారని, కుటుంబసభ్యులను బెదిరించడమే కాకుండా బూతులు తిట్టారని మోహన్ బాబు, మంచు విష్ణు ఫిర్యాదులో తెలిపారు. సీసీటీవీ కెమెరాలో కారు దృశ్యాలు రికార్డు అయ్యాయి. దాని ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ జరుపుతున్నారు. గేటు దగ్గర వాచ్ మెన్ లేకపోవడంతో కారు లోపలికి వచ్చినట్టు తెలుస్తోంది. కారులో మొత్తం నలుగురు దుండగులు ఉన్నారని తెలుస్తోంది.

అసలు ఏం జరిగింది? దుండగులు ఎవరు? ఎందుకు చొరబడ్డాడు? మోహన్ బాబు ఫ్యామిలీని ఎందుకు బెదిరించారు? ఎందుకు హాని తలపెట్టాలని అనుకున్నారు? ఇప్పుడీ ప్రశ్నలు హాట్ టాపిక్. వీటిని చేధించే పనిలో పోలీసులు ఉన్నారు. ఇది శత్రువులు చేసిన పనా లేక ఆకతాయిల పనా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దీనిపై మోహన్ బాబు కుటుంబం నుంచి ఇంకా ఎలాంటి స్టేట్ మెంట్ రాలేదు.