34 ఏళ్ల విక్టరీ వెంకటేష్ నటప్రస్థానం..
విక్టరీ వెకంటేష్.. అగ్ర నిర్మాత డి.రామానాయుడి తనయుడిగా సినీ రంగప్రవేశం చేసినా అతితక్కువ సమయంలోనే తనకంటూ ఓ సొంత గుర్తింపు, ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పరచుకున్నారు. వెంకటేష్ నటించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’ 1986 ఆగస్టు 14న విడుదలైంది. 2020 ఆగస్టు 14 నాటికి సినిమా పరిశ్రమలోకి వచ్చి విజయవంతంగా 34 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. సందర్భంగా సురేశ్ ప్రొడక్షన్స్ శుక్రవారం ప్రత్యేక పోస్టర్ను విడుదల చేసింది. అందులో వెంకీ తాజాగా నటిస్తోన్న ‘నారప్ప’ క్యారెక్టర్ను హైలెట్ చేసింది.
ఈ సందర్భంగా వెంకటేష్ నటప్రస్థానం గురించి గమనిస్తే..
1971లో ‘ప్రేమ నగర్’ సినిమాలో బాలనటుడిగా కనిపించారు. అనంతరం 1986లో ‘కలియుగ పాండవులు’ చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమాకే నంది అవార్డును దక్కించుకున్నారు. నటి ఖుష్బూకు దక్షిణాదిన ఇదే తొలి సినిమా కావడం విశేషం. తమిళ్ చినతంబి రీమేక్ ‘చంటి’తో ఆయన బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నారు. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ వంటి సినిమాతో మహిళా ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు.
‘ప్రేమించుకుందాం రా’, ‘సూర్యవంశం’ ఆయన ఎవర్గ్రీన్ చిత్రాలు. ‘రాజా, కలిసుందాం రా, జయం మనదేరా, సంక్రాంతి, దృశ్యం’.. వంటి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లు ఆయన ఖాతాలో ఉన్నాయి. మల్టీస్టారర్ చిత్రాలు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎఫ్ 2, వెంకీమామ అన్నీ కూడా మంచి వసూళ్లను రాబట్టాయి. ప్రస్తుతం తమిళ్ బ్లాక్ బస్టర్ అసురన్ రీమేక్ ‘నారప్ప’లో నటిస్తున్నారు. 34 ఏళ్ల సినీ ప్రయాణంలో వెంకటేష్ ఉత్తమ నటుడిగా ఏడు సార్లు నంది అవార్డులు గెలుపొందారు.