ఆ పవర్ బాలు గారి పాటకు మాత్రమే ఉంది: విజయశాంతి

  • Published By: sekhar ,Published On : August 23, 2020 / 04:38 PM IST
ఆ పవర్ బాలు గారి పాటకు మాత్రమే ఉంది: విజయశాంతి

Vijayashanti about SPB: కరోనా బారిన పడిన గాన గంధర్వుడు, సుప్రసిద్ధ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం క్షేమంగా తిరిగి రావాలని దేశం మొత్తం ప్రార్థనలు చేస్తోంది. బాలు ప్రస్తుతం చెన్నై ఎం.జి.ఎం హెల్త్ కేర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. బాలు ఆరోగ్యంగా తిరిగి రావాలని సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ కోరుకుంటున్నారు. సీనియర్ హీరోయిన్, రాజకీయ నాయకురాలు విజయశాంతి కూడా బాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

‘తన 54 సంవత్సరాల కళా ప్రస్థానంలో సాధించుకున్న అశేషమైన అభిమానుల ప్రేమ, పూజల కారణంగా బాలూ గారు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని విశ్వసిస్తున్నాను. దక్షిణాది సినిమా పాటలకు ఎస్పీబీ ఓ బ్రాండ్ నేమ్ అనడం అతిశయోక్తి కాదు. డ్యాన్స్ రానివారితో కూడా స్టెప్స్ వేయించే శక్తి, మ్యూజిక్ తెలియనివారితో కనీసం హమ్మింగ్ చేయించే పవర్ బాలు పాటకు ఉంది. కనీసం రెండు తరాల జీవితాలు బాలూ గారి పాటతో పెనవేసుకుని ఉంటాయి. ఒక తరం పూర్తిగా బాలూగారి పాటలు వింటూ పెరిగింది. ఇక, టీవీ షోల ద్వారా ఎందరో గాయనీ గాయకులను బాలూగారు ప్రోత్సహించారు. వారు సినీ రంగంలో నిలదొక్కుకుకునేందుకు ఊతమిచ్చారు.

పాటే కాదు, భావి తరాలకు వినయం, విధేయత వంటి సుగుణాలను కూడా తన ప్రవర్తన ద్వారా బాలూ గారు తెలియజెప్పారు. ఇవాళ వాళ్లందరూ బాలూ గారి పాట కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన తెలుగువారే కాదు తమిళం, కన్నడం, మలయాళం, ఉత్తరాది రాష్ట్రాల అభిమానులు కూడా ఎస్పీబీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత మంది సంకల్పం ఊరికే పోదు. కచ్చితంగా మళ్లీ బాలుగారు మనకోసం పాడేలా చేస్తుంది’ అంటూ విజయశాంతి పేర్కొన్నారు.

https://www.facebook.com/VijayashanthiOfficial/posts/1178221832544512