కాబోయే భార్య బయోపిక్ తీస్తా..
ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి పదమూడు సార్లు జాతీయ బాడ్మింటన్ విజేతగా నిలిచిన అర్జున అవార్డు గ్రహీత గుత్తా జ్వాల జీవిత చరిత్రను సినిమాగా తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు యువ నటుడు విష్ణు విశాల్. కోలీవుడ్లో సక్సెస్ ఫుల్ హీరోగా ఉన్న విశాల్.. పాన్ ఇండియా సినిమాగా రూపొందిన కాడన్(తెలుగులో అరణ్య) చిత్రం ఈనెల 26వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్.. చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఈ ఏడాది తాను నటించిన నాలుగు చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయని వెల్లడించిన విశాల్.. త్వరలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాలాను పెళ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇది ప్రేమ వివాహం కాదని, ఇంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందని, అందు వల్ల తాను, జ్వాలా ఒకరికొకరం అర్థం చేసుకుని గౌరవించుకుని పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు చెప్పారు.
ఈ సంధర్భంగా మరో ఆసక్తికర విషయాన్ని కూడా వెల్లడించారు విష్ణు విశాల్. జ్వాల బయోపిక్ను చిత్రంగా నిర్మించాలని ఆలోచన తనకు ఉందని అన్నారు. తాను తెలుగింటి అల్లుడ్ని కాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు విష్ణు విశాల్. జ్వాల, విష్ణు విశాల్ చాలాకాలంగా ప్రేమలో ఉన్నారు. లాక్ డౌన్ సమయంలో వీరి నిశ్చితార్థం జరిగింది.
అరణ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘‘మూడు భాషల్లో నటిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ జ్వాలా ఎంకరేజ్మెంట్, మద్దతుతో నేను ధైర్యం చేయగలిగాను. అతి త్వరలోనే మేం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం. తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా పెళ్లి తేదిని ప్రకటిస్తాం’’ అని అన్నారు.