అన్నయ్య త్వరగా కోలుకోవాలి..
Chiranjeevi-Pawan Kalyan: మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడడంతో యావత్ చిత్ర పరిశ్రమతో పాటు అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ ప్రారంభించే సందర్భంగా.. ప్రొటోకాల్ ప్రకారం చేయించుకోవాల్సిన కోవిడ్ టెస్ట్లలో ఎటువంటి లక్షణాలు లేకపోయినా.. తనకు కరోనా పాజిటివ్గా నిర్థారణ అయినట్లు స్వయంగా చిరంజీవే తెలియజేసిన విషయం తెలిసిందే.
మెగాస్టార్కు కరోనా పాజిటివ్ అని తెలియగానే తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా ఆయన ఈ మహమ్మారి నుంచి త్వరగా కోలుకుని.. మళ్లీ షూటింగ్లో పాల్గొనాలి కోరుతూ ట్వీట్స్ చేశారు. తాజాగా తన అన్నయ్య చిరంజీవికి పాజిటివ్ అని తెలిసిన పవన్ కళ్యాణ్.. ఆయన సత్వరమే కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లుగా తెలుపుతూ.. జనసేన పార్టీ తరఫున ఓ లెటర్ విడుదల చేశారు.
‘‘అన్నయ్య చిరంజీవి లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడమే కాదు.. ప్రతి ఒక్కరిలో చైతన్యం కలిగించేలా సామాజిక బాధ్యతగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ప్రజారోగ్యంపై ఎంతో అవగాహన ఉన్న అన్నయ్య.. తన ఆరోగ్యంపట్లా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అన్నయ్య కరోనా బారినపడటంతో మేమంతా విస్తుపోయాం. ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. పరీక్షల్లో మాత్రం పాజిటివ్ అని తేలింది.
అన్నయ్య సత్వరమే కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. కరోనా వైరస్కు వ్యాక్సిన్ కోసం సాగుతున్న ప్రయోగాలు త్వరగా ఫలవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచం అంతా ఆ వ్యాక్సిన్ కోసం ఎంతగానో ఎదురుచూస్తోంది. మరో వైపు కోవిడ్ సెకండ్ వేవ్ ప్రమాదం ఉందనే వైద్య ఆరోగ్య నిపుణుల హెచ్చరికలు చూస్తున్నాం. జాగ్రత్తలు పాటించడంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను..’’ అని పవన్ లెటర్లో తెలిపారు.