కావేరి కళ్యాణి కొత్త ఆరంభం..

ద‌ర్శ‌క నిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి.. ప్రీ లుక్, టీజ‌ర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన పూరి జ‌గ‌న్నాథ్‌..

  • Published By: sekhar ,Published On : March 9, 2020 / 08:01 AM IST
కావేరి కళ్యాణి కొత్త ఆరంభం..

ద‌ర్శ‌క నిర్మాత‌గా మారిన న‌టి క‌ల్యాణి.. ప్రీ లుక్, టీజ‌ర్ గ్లింప్స్ రిలీజ్ చేసిన పూరి జ‌గ‌న్నాథ్‌..

రాజ‌శేఖ‌ర్ నటించిన ‘శేషు’ చిత్రం ద్వారా తెలుగు పరిశ్రమకు హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైన క‌ల్యాణి ప‌లు చిత్రాల్లో న‌టించి మెప్పించింది. డైరెక్ట‌ర్ సూర్య‌కిర‌ణ్‌ను వివాహం చేసుకున్న త‌ర్వాత కొన్నిరోజుల పాటు ఈమె సినిమాల‌కు దూర‌మ‌య్యారు. అయితే భ‌ర్త‌తో మ‌న‌స్ప‌ర్ధ‌ల కార‌ణంగా విడాకులు తీసుకున్న క‌ల్యాణి.. తాజాగా ద‌ర్శ‌క నిర్మాత‌గా మారారు. ఇటీవ‌లి కాలంలో అతిథి పాత్ర‌ల్లో క‌నిపిస్తూ వ‌స్తున్న ఆమె కే2కే ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా విల‌క్ష‌ణ ప్రేమ‌క‌థ‌తో సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా క‌ల్యాణి తీస్తున్న ఈ సినిమా తెలుగు, త‌మిళ ద్విభాషా చిత్రంగా త‌యార‌వుతోంది. ఈ సినిమా ప్రీ లుక్‌, టీజ‌ర్ గ్లింప్స్‌ను హోలీ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఆవిష్క‌రించారు.

చేత‌న్ శీను, సిద్ది, సుహాసినీ మ‌ణిర‌త్నం, రోహిత్ ముర‌ళి, శ్వేత ఈ చిత్రంలో ప్ర‌ధాన పాత్ర‌ధారులు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. బాల‌న‌టిగా కెరీర్ ఆరంభించిన క‌ల్యాణి, 1986 నుంచి సినిమాల్లో న‌టిస్తూ వ‌స్తున్నారు. త‌న‌కున్న విస్తృతానుభ‌వంతో ఒక‌వైపు నిర్మాత‌గా మారుతూనే మ‌రోవైపు ద‌ర్శ‌క‌త్వాన్నీ చేప‌ట్టారు. 

See Also | సొంతంగా ఆలోచించే ప్రతీ ఒక్కడూ సూపర్ ‘హీరో’నే..