న్యూ లుక్లో నాగ చైతన్య..
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అన్ని సామాజిక వర్గాలకు చేరువైంది. చిన్న పిల్లల నుంచి వయోవృద్ధుల వరకు, రైటర్ నుంచి యాక్టర్ వరకు, కార్యకర్త నుంచి ప్రధాన కార్యదర్శుల వరకు, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, కోటా నుండి కోలకతా వరకు.. ఆల్ ఇండియాలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సెర్చ్ ఇంజిన్లో టాప్, ట్రెండింగ్లో హిస్టరీ క్రియేట్ చేస్తోంది.
ఇలా ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ఆదరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. ఇందులో భాగంగా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య దర్శకురాలు నందిని రెడ్డి ఇచ్చిన ఛాలెంజ్ను స్వీకరించి గచ్చిబౌలిలోని తన నివాసంలో మొక్కలు నాటి, ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ.. ‘‘మనకు జీవించటానికి భూమి ఒక్కటే ఆధారం. మనకు వేరే ఆధారం ఇప్పటివరకు లేదు. అలాంటి భూమిని కాపాడాలి అంటే విరివిగా మొక్కలు నాటాలి. మన అవగాహనా లోపంతో మనం మొక్కలు నాటడం విషయంలో అశ్రద్ధ చేస్తున్నాం. అలా అశ్రద్ధ చేయకుండా ఇలాంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమం ఇలానే ముందుకు కొనసాగడానికి నా వంతుగా మరో నలుగురిని.. యాక్టర్ సుశాంత్, స్క్రీన్ రైటర్ మరియు డైరెక్టర్ శివ నిర్వాణ, నటి రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టరు విక్రమ్ కె కుమార్ గార్లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి నామినేట్ చేస్తున్నాను..’’ అని తెలిపారు.