చేదు నిజం : కోటి మంది టికెట్ కొన్నారు, కానీ..రైలు ప్రయాణం చేయలేదు
1 Crore Waitlisted Passengers Denied Train Travel : దేశంలో పెరుగుతున్న రైల్వే ప్రయాణికుల అవసరాలను ఆ శాఖ తీర్చేలేకపోతోందన్న చేదు నిజం మరోసారి బయట పడింది. టికెట్ కొన్నా…చాలా మంది ప్రయాణానికి దూరమవుతున్నారన్న విషయం ఓ ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైంది.
ఒక్క 2019-2020 ఏడాదిలోనే ఇలా కోటి మందికి పైగా ప్రజలు రైల్వే ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. వెయిటింగ్ లిస్ట్ ఉండే టికెట్లు ఆటోమేటిక్గా రద్దు కావడమే ఇందుకు కారణం. ఈ విధంగా 2019-2020లో మొత్తం 84 లక్షల 61వేల 204 ప్యాసింజర్ నేమ్ రికార్డు నంబర్లు కలిగిన కోటి 25 లక్షల మంది ప్రయాణానికి దూరమయ్యారని తేలింది. మధ్యప్రదేశ్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన దరఖాస్తు ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
https://10tv.in/bullet-train-is-coming-mumbai-hyderabad/
ఆర్టీఐ దరఖాస్తు ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం..2014-15లో కోటి 13 లక్షల 17 వేల 481 పీఎన్ఆర్ నంబర్లు రద్దు కాగా..,2015-16లో 81లక్షల 5వేల 22.., 2016-17లో 72లక్షల 13వేల 131.., 2017-18లో 73లక్షల 2వేల 42..,2018-19లో 68లక్షల 97వేల 922 నంబర్లు రద్దయ్యాయని తేలింది. 2019-2020లో సగటు వెయిటింగ్ లిస్ట్ డ్రాప్ 8.9 శాతం ఉండగా..రద్దీ సమయాల్లో ఇది 13.3 శాతంగా ఉంటోంది.
ఆన్లైన్లో వెయిటింగ్ లిస్ట్ టికెట్ బుక్ చేసుకున్న వారికి చార్ట్ రూపొందించిన తర్వాత ఆటోమేటిక్గా టికెట్ క్యాన్సిల్ అవుతుంది. అలా రద్దైన టికెట్ల తాలూకా మొత్తం ప్రయాణికుల ఖాతాల్లో జమ అవుతుంది. వెయిటింగ్ లిస్ట్ జాబితా పెరుగుతున్న విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్మన్ సైతం ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో అంగీకరించారు.