నక్కకు కూడా బాంబు పెట్టి చంపేశారు : ఆగని మూగజీవాల మరణఘోష
కేరళలో ఓ ఏనుగు..ఓ ఆవు..అస్సాంలోని రిజర్వాయర్ లో 13 కోతులకు విషాహారం పెట్టిన చంపేసిన ఘటనలు మరువకుండానే తమిళనాడులో మరో మూగ జీవానికి బాంబు పెట్టి చంపేశారు. మానవత్వం నశించిపోతున్న మనుషుల వికృతచేష్టలకు మూగజీవాలు బలైపోతున్నాయి. మూగజీవాల మరణఘోషతో మనిషి శాడిజాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి.
తమిళనాడులోని ట్రిచీలో ఓ నక్కను పట్టుకోవడానికి కొందరు మాటు వేశారు. నక్క సమీపంలో మాంసం పెట్టి అందులో బాంబు పెట్టారు. మాంసంలో బాంబు ఉందని తెలియక నక్క దానిని తిన్నది. దీంతో నక్క నోట్లో బాంబు పేలి అక్కడికి అక్కడే చనిపోయింది.
తమ పాచిక పారిందని మురసిపోయిన వారు నక్క మృతదేహాన్ని సంచిలో వేసుకుని అక్కడకు దగ్గరల్లో ఉన్న ఓ టీ స్టాల్ దగ్గర ఆగి టీ తాగుతున్నారు. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఓ కానిస్టేబుల్ కు వారి వ్యవహారం అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్లను ప్రశ్నించారు. దీంతో భయపడినవారు తలాతోకాలేకుండా మాట్లాడుతుండతంతో అనుమానం మరింత బలపడి వారి దగ్గరున్న సంచీలను తనిఖీలు చేయటంతో అసలు విషయం బయట పడింది.
వారిద్దరిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తీసుకెళ్లాడు. తరువాత తమదైన శైలిలో విచారించేసరికి మొత్తం విషయం చెప్పేశారు. నక్క చావుకి కారణమైన మొత్తం 12 మందిని పోలీసులు అరెస్టు చేసారు. వీరు తిరువేరుంబూర్ ప్రాంతానికి సమీపంలో ఉన్న పులంకూరికాలనీకి చెందిన వీరు నక్కను దంతాలు, మాంసం కోసం చంపామని చెప్పారు. తరువాత వీరిని రిమాండ్ కు తరలించి కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
అసలు వారికి బాంబు ఎలా వచ్చింది? ఎవరి దగ్గరనుంచి కొన్నారు? ఎన్నాళ్లుగా ఇలా వన్యప్రాణుల్ని వేటాడుతున్నారు? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగుతోంది.