ప్రశాంత్ భూషణ్ కు మద్దతుగా….సుప్రీంకు 1500 లాయర్లు విన్నపం

  • Published By: venkaiahnaidu ,Published On : August 18, 2020 / 04:13 PM IST
ప్రశాంత్ భూషణ్ కు మద్దతుగా….సుప్రీంకు 1500 లాయర్లు విన్నపం

సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్ పై ఇటీవల కోర్టు ధిక్కార నేరాన్ని తేల్చటమే కాదు… ఆయనను దోషిగా పేర్కొంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తీరుపై న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం తీర్పుపై అసహనం వ్యక్తం చేస్తున్న వారు.. అత్యున్నత ధర్మాసనానికి బహిరంగ లేఖ ఒకటి రాసిన వైనం ఆసక్తికరంగా మారింది.



కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రశాంత్ భూషణ్ కు దన్నుగా నిలుస్తూ సుప్రీం కోర్టుకు లేఖ రాసిన 1500 మందిలో మహారాష్ట్ర మాజీ అడ్వకేట్ జనరల్ ఖంబాటా.. సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే తో పాటు పలువురు సీనియర్లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు విడుదల చేసిన లేఖలో కొన్ని అంశాల్ని కాస్తంత ఘాటుగానే ఉన్నాయని చెప్పక తప్పదు.



న్యాయవాదుల మౌనం బలమైన న్యాయవ్యవస్థను నిర్మించలేదన్న ఆయన.. కోర్టు దిక్కారం పేరుతో న్యాయవాదుల నోళ్లను మూయటం సరికాదన్న మాట ఇప్పుడు అందరిని చూపు ఆ లేఖ మీద పడేలా చేసిందని చెప్పాలి. స్వతంత్ర న్యాయవ్యవస్థలో స్వతంత్ర న్యాయమూర్తులు.. స్వతంత్ర న్యాయవాదులు ఉంటారని గుర్తు చేశారు.



అదే లేఖలో..ఇద్దరి మధ్య పరస్పర గౌరవం.. చక్కటి వాతావరణం ఉండాలని కోరారు. బార్.. బెంచ్ మధ్య సమతూకం కోల్పోతే అది దేశానికే ప్రమాదకరమన్న హెచ్చరిక ఈ లేఖలో అంతీర్లనంగా దాగి ఉందని చెప్పాలి. ఈ లేఖపై సుప్రీం కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.



కాగా , గతంలో ట్విటర్లో ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తికి, ఆయనకు ముందు సీజేఐలుగా ఉన్న మరో నలుగురి గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని, ఇవి కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని ఇటీవల సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. ఇది కోర్టు ధిక్కరణకు సంబంధించిన తీవ్రమైన విషయం అని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో న్యాయమూర్తులు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రశాంత్ భూషణ్‌కు శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటామని చెప్పింది.