Kisan Parliament : జంతర్మంతర్ వద్ద రైతుల నిరసన
నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.
Kisan Parliament నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రైతులు.. ప్రభుత్వం ఆ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో పార్లమెంటు సమవేశాల నేపథ్యంలో రైతు సంఘాలు సాగు చట్టాలకు వ్యతిరేకంగా సెంట్రల్ ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గురువారం నిరసన చేపట్టాయి. భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయిత్ ఆధ్వర్యంలో రైతు నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. సంయుక్త కిసాన్ మోర్చా నుంచి 200 మంది, కిసాన్ సంఘర్ష్ కమిటీ నుంచి ఆరుగురు రైతులు ధర్నాలో పాల్గొన్నారు. వీరంతా సింఘూ సరిహద్దు నుంచి ప్రత్యేక బస్సుల్లో జంతర్మంతర్ చేరుకున్నారు.
కాగా,ఢిల్లీ సరిహద్దుల్లో గతేడాది నవంబర్ నుంచి నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో సమీపంలోని జంతర్మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలకు అనుమతి కోరగా… ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైతుల నిరసన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
గురువారం మొదలుకొని పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసేవరకు ప్రతి రోజు 200 మంది రైతులు పార్లమెంటు వెలుపల నిరసన వ్యక్తం చేస్తారు. తమ అంతిమ లక్ష్యం నూతన రైతు చట్టాలను రద్దు చేయడమే అని కిసాన్ ఏక్తా మోర్చా సభ్యులు తెలిపారు. మరోవైపు,ఇవాళ పార్లమెంటు ఆవరణలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పంజాబ్కు చెందిన ఆ పార్టీ ఎంపీలు రైతులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.