21 ఏళ్లకే జడ్జి : చరిత్ర సృష్టించిన జైపూర్ కుర్రాడు
అతి చిన్న వయస్సులోనే న్యాయమూర్తి అయి చరిత్ర సృష్టించాడు జైపూర్ కుర్రాడు. రాజస్థాన్ యూనివర్శిటీలో చదువుకున్న 21 సంవత్సరాల మయాంక్ ప్రతాప్ సింగ్ జడ్జిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. రాజస్థాన్లోని జైపూర్కు చెందిన 21 ఏండ్ల మయాంక్ ప్రతాప్ సింగ్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ కోర్సును 2019 ఏప్రిల్లో పూర్తి చేసాడు. మయాంక్ జడ్జిల నియామక పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే పాస్ కావటం మరో విశేషం.
ఈ సందర్భంగా మయాంక్ మాట్లాడుతూ మంచి న్యాయమూర్తిగా ఎదగడానికి తాను అంకితభావంతో పనిచేస్తానని.. దయాగుణం, నిజాయితీ న్యాయమూర్తి పదవికి అత్యంత కీలకమని అన్నాడు. మాయంక తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్లుగా పనిచేస్తున్నారు.
కాగా..జ్యూడీషియల్ పరీక్షలు రాయడానికి గతంలో మినిమమ్ 23 ఏళ్ల వయసు ఉండాలనే నిబంధన ఉండేది. కానీ ఇటీవల రాజస్థాన్ హైకోర్టు సవరించి 21 ఏండ్ల వయసుకు కుదించింది. ఇది మయాంక్ జడ్జి కావటానికి దోహదపడింది. మరోవైపు రాజస్థాన్లోనే కాకుండా దేశంలో కూడా అతి చిన్న వయసులోనే జడ్జిగా మయాంక్ కే కావటం విశేషం.