Punjab Congress : కెప్టెన్ కి కష్టకాలం..సీఎం రాజీనామాకు పట్టుబడుతున్నమంత్రులు,ఎమ్మెల్యేలు
పంజాబ్ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలుమొదలయ్యాయి. అయితే ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పైనే కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు.
Punjab Congress పంజాబ్ కాంగ్రెస్ లో మరోసారి లుకలుకలు మొదలయ్యాయి. అయితే ఈసారి ఏకంగా ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ పైనే కొందరు ఎమ్మెల్యేలు తిరుగుబాటు బావుటా ఎగరేశారు. అమరీందర్ సింగ్ రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన దాదాపు 30 మంది ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో నలుగురు కేబినెట్ మంత్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వాగ్ధానాలకు సంబంధించి..సీఎంపై తమకు విశ్వాసం లేదని అసమ్మతి ఎమ్మెల్యేలు చెబుతున్నారు. 2017 ఎన్నికలకు ముందు తమకిచ్చిన హామీలను కెప్టెన్ నెరవేర్చలేదని వారు ఆరోపించారు. సీఎంని మార్చాలని పరోక్షంగా అసమ్మతి ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.
కాగా, కశ్మీర్ ప్రత్యేక దేశమంటూ నవజ్యోత్సింగ్ సిద్ధూ సలహాదారులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో ముఖ్యమంత్రిని తప్పించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తుండటం అధికార పక్షాన్ని మరింత క్లిష్టపరిస్థితుల్లోకి నెట్టేస్తోంది. 117 అసెంబ్లీ సీట్లున్న పంజాబ్లో..వచ్చే ఏడాది ప్రారంభంలో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
సీఎం అమరీందర్ రాజీనామాను డిమాండ్ చేస్తున్న వారిలో ఎమ్మెల్యేలు.. త్రిప్ట్ రాజిందర్ బజ్వా, సుఖ్జిందర్ సింగ్ రాంధావా, చరణ్జిత్ సింగ్ చన్ని, సుఖ్బిందర్ సింగ్ సర్కారియాలతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ పర్గట్ సింగ్లు ఉన్నట్లు సమాచారం. మరికొంత మంది పేర్లు ఇంకా బయటికి రాలేదు. అయితే వీరంతా సిద్దూకి అత్యంత సన్నిహితులు.
మంత్రి రాజిందర్ సింగ్ భజ్వా నివాసంలో.. సుఖ్బిందర్ సింగ్ సర్కారియా, సుఖ్జిందర్ సింగ్ రంధ్వారా, చరణ్జిత్ సింగ్ ఛన్నితో పాటు 20 మందికిపైగా ఎమ్మెల్యేలు ఇవాళ భేటీ అయ్యారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించేందుకు ఆమెను కలవాలని భేటీలో సభ్యులు నిర్ణయించారు. ఊహించని రీతిలో చర్యలు చేపడితేనే రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితులు మెరుగుపడుతాయని పేర్కొన్న భజ్వా.. అవసరమైతే సీఎంను కూడా తప్పించాలని తేల్చిచెప్పారు. కెప్టెన్ను తప్పించాలన్నది తమ ఒక్కరి డిమాండ్ కాదని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని తెలిపారు. ఇక,పంజాబ్ పీసీసీ చీఫ్ నవజ్యోత్ సిద్ధూని కూడా ఇవాళ అసమ్మతి ఎమ్మెల్యేలు కలిశారు. ఇక, పాకిస్తాన్, కశ్మీర్ అంశాలపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సలహాదారులను అమరీందర్ టార్గెట్ చేయడాన్ని వారు ఖండిస్తున్నారు