ఛత్తీస్గఢ్ లో దారుణం.. గదిలో ఊపిరాడక 43 ఆవులు మృతి
ఛత్తీస్గఢ్ లో దారుణం జరిగింది. గదిలో ఊపిరాడక 43 ఆవులు మృతి చెందాయి. బిలాస్పూర్ జిల్లా తాఖత్పూర్ బ్లాక్ పరిధిలోని మెడ్పర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెడ్పర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు విరగ్గొట్టి చూశారు. అందులో భారీ సంఖ్యలో ఆవులు కుక్కి ఉండటం చూసి షాక్కు గురయ్యారు.
గదిలో మొత్తం 60 ఆవులు ఉండగా.. అందులో కేవలం 17 ఆవులు మాత్రమే ప్రాణాలతో ఉన్నాయి. మిగతా 43 ఆవులు మృతి చెందాయి. దీంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ యాక్ట్, ఐపీసీలోని సెక్షన్ 429 ప్రకారం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ ఘటనపై బిలాస్పూర్ జిల్లా కలెక్టర్ సరాన్స్ మిట్టర్ విచారం వ్యక్తం చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందన్నారు. అంత పెద్ద సంఖ్యలో ఆవులను ఎవరు బంధించారు? ఆ ఆవులు ఎప్పటి నుంచి ఆ గదిలో ఉన్నాయి? వాటిని ఎందుకు బంధించారు? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారని కలెక్టర్ చెప్పారు.