గల్వాన్ ఘర్షణలో 45మంది చైనా సైనికులు మృతి : రష్యా న్యూస్ ఏజెన్సీ

గల్వాన్ ఘర్షణలో 45మంది చైనా సైనికులు మృతి : రష్యా న్యూస్ ఏజెన్సీ

TASS గతేడాది జూన్ లో తూర్పు లడఖ్ లోని గల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో 20 మంది జవాన్లు అమరులైనట్లు భారత్‌ అప్పట్లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాటి ఘర్షణలో ఎంతమంది చైనా సైనికులు చనిపోయారనేదానిపై ఇప్పటికీ ఓ సృష్టత లేదు. భారత్ సైనికుల భీకర ప్రతిదాడికి తట్టుకోలేక 40 మందికి పైగానే చైనా సైనికులు మరణించారనే వాదనలు అప్పట్లో వ్యక్తమయ్యాయి. అమెరికా నిఘా సంస్థల సమాచారం ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయి. అయితే..చైనా మాత్రం ఈ వార్తలను తోసి పుచ్చింది. కానీ తనకు కలిగిన నష్టం గురించి చైనా ఇప్పటివరకూ స్పందించలేదు.

అయితే.. గల్వాన్ ఘర్షణలో చైనా జవాన్ల మరణాలపై నాడు వెలువడిన అంచనాలే నిజమని చెప్పేలా తాజాగా రష్యా అధికార వార్తా సంస్థ TASS కీలక వార్తను వెలువరించింది. గల్వాన్ ఘర్షణలో 45 మంది చైనా సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు టీఏఎస్ఎస్ తెలిపింది. గల్వాన్ ఘర్షణల్లో చైనా జవాన్ల మృతి అంశంపై అప్పట్లో అమెరికా ఇంటిలిజెన్స్‌ వర్గాలు వెలువరించిన నివేదికలు, కొన్ని అంతర్జాతీయ వార్తా కథనాలను TASS తన కథనంలో ప్రస్తావించింది. లడఖ్ సరిహద్దులో భారత్‌-చైనా మధ్య 9 నెలలుగా సాగుతున్న ప్రతిష్టంభనకు తెరదించుతూ ఇరు దేశాల బలగాలను ఉపసంహరణ ప్రక్రియ మొదలైన వేళ రష్యా వార్తా సంస్థ ఈ కథనాన్ని ప్రచురించింది.

గతేడాది జూన్ 15 గల్వాన్ లోయలో చైనా, భారత్ సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తుపాకీలు ప్రయోగించకూడదన్న ఒప్పందాన్ని అడ్డంపెట్టుకుని చైనా సైనికులు ముళ్లు రాడ్లతో భారత్ సైనికులపై దాడి చేశారు. మూడు మార్లు ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నట్టు తెలిసింది. గల్వాన్ ఘర్షణల్లో కల్నల్ సంతోశ్ బాబు సహా అమరులైన 20 మంది భారత జవాన్లకు యావత్ భారతావని ఘనంగా నివాళి అర్పించింది. వేలాది మంది అశ్రు నయనాల మధ్య ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. ఖాళీ చేతులతోనే ప్రాణాలకు తెగించి పోరాడిన అమరవీరులకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాలను ప్రకటించింది.

చైనా ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. భారత సైన్యం చేతిలో తమ జవాన్లు మరణించిన విషయాన్ని అవమానంగా భావించింది కమ్యూనిస్ట్ దేశం. ఈ కారణంతో జవాన్ల మరణాల గురించి పైకి చెప్పలేదు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులకు చివరికి సరైన గౌరవం కూడా దక్కలేదు. ఆ జవాన్లకు గోప్యంగా అంత్యక్రియలు నిర్వహించాలని, వారి పేరుతో శిలాఫలకాలు ఏర్పాటు చేయొద్దని కుటుంబసభ్యులను ఆదేశించినట్లు అప్పట్లో అంతర్జాతీయ కథనాల్లో పేర్కొన్నారు. భారత్‌లో అమర జవాన్లకు అందిన గౌరవాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కొంత మంది చైనీయులు తమ ప్రభుత్వ తీరు పట్ల అసహనం వ్యక్తం చేసినట్లు కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి.