Girl Dies With Thirsty : హృదయవిదారకం.. తాగునీరు లేక ఐదేళ్ల చిన్నారి మృతి

రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాగునీరు దొరక్క ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది.

Girl Dies With Thirsty : హృదయవిదారకం.. తాగునీరు లేక ఐదేళ్ల చిన్నారి మృతి

Girl Dies With Thirsty

Girl Dies With Thirsty : రాజస్థాన్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తాగునీరు దొరక్క ఐదేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో ఉన్న వృద్ధురాలు స్పృహ తప్పి పడిపోయింది. రాయ్‌పుర్‌ నుంచి రాణివాడా తాలూకాలోని రోడా గ్రామానికి సుకి దేవి భిల్‌ (60) తన మనవరాలు అంజలితో బయలుదేరింది. ఎండ ఎక్కువగా ఉండటం, మార్గమధ్యంలో తాగడానికి నీరు కూడా లేకపోవడం వల్ల ఉన్నట్టుండి ఇద్దరూ కుప్పకూలిపోయారు. కాసేపటికే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు వృద్ధురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది.

అంజలి, సుకి దేవిలు.. సిరోహి జిల్లా నుంచి జలోర్ జిల్లాలోని గ్రామానికి పయనం అయ్యారు. ఇందుకోసం దగ్గరి దారి ఎంచుకున్నారు. వాస్తవానికి రోడ్డు మీదుగా వెళితే 22 కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. అంత దూరం నడవలేక.. అడ్డదారిని ఎంచుకున్నారు. అది 15 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఆ దారి ఎడారి గుండా వెళ్తుంది. అయినా వాళ్లు లెక్క చేయలేదు. ఆ దారిలోనే వెళ్లారు. అయితే కొంతదూరం వెళ్లగానే వారు అలసిపోయారు. ఎండ ఎక్కువగా ఉండటంతో దాహంతో అలమటించారు. తాగడానికి నీరు లేక సొమ్మసిల్లి పడిపోయారు.

కొంత దూరం నడిచాక చిన్నారికి బాగా దాహం వేసింది. తాగేందుకు నీరు కావాలని పదే పదే అవ్వని అడిగింది. కానీ ఆమె దగ్గర నీరు లేవు. కనుచూపు మేరలో ఎక్కడా తాగునీరు కనిపించ లేదు. అదే సమయంలో దారిలో ఓ గొర్రెల కాపరి కనిపించాడు. తాగడానికి నీరు ఇవ్వాలని వారు అడిగారు. అందుకు అతడు నిరాకరించాడు. ఆ కాసేపటికే చిన్నారి స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత అవ్వ పడిపోయింది. అదే దారిలో వెళ్తున్న మరో గొర్రెల కాపరి వారిని గమనించాడు. వెంటనే స్థానిక సర్పంచ్ కి సమాచారం ఇచ్చాడు. సర్చంచ్ పోలీసులకు చెప్పాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సుకి దేవికి తాగునీరు అందించారు.

ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చిన్నారి చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. డీహైడ్రేషన్ కారణంగా పాప చనిపోయిందన్నారు. సుకి దేవికి చికిత్స అందిస్తున్నారు. కాగా వారిద్దరూ 5 గంటల పాటు 7 కిలోమీటర్లు మండుటెండలో నడిచారు. వారు ఊరికి వెళ్లేందుకు తప్పు దారి ఎంచుకున్నారు. పైగా, వెంట తాగునీరు కూడా తీసుకెళ్లలేదు. ఈ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ పూనియా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వారి అసమర్థ పాలన వల్లే రాజస్తాన్ ఎడారిలా మారిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు ఆకలితో, దాహంతో అలమటిస్తున్నారని వాపోయారు. రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. మాఫియాలు రాజ్యం ఏలుతున్నాయని మండిపడ్డారు.