61 MLAలకు బర్త్ సర్టిఫికెట్లు లేవు….NPR,NRCలకు వ్యతిరేకంగా ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం
వివాదాస్పద NRC,NPRలకు వ్యతిరేకంగా శుక్రవారం(మార్చి-13,2020)ఢిల్లీ అసెంబ్లీ తీర్మాణం చేసింది. అసెంబ్లీలో తీర్మాణం సమయంలో మీలో ఎంతమందికి బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని ఎమ్మెల్యేలను అడుగగా,70 మంది ఎమ్మెల్యేల్లో 61 మందికి జన్మ ద్రువీకరణ పత్రాలు లేవని అన్నారు. కేవలం 9 మంది ఎమ్మెల్యేలు మాత్రమే తమ దగ్గర బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని అసెంబ్లీలో చేతులు లేపారు. ఆమ్ ఆద్మీ పార్టీకి అసెంబ్లీలో మొత్తం 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిగితా సీట్లు అన్నీ బీజేపీ ఖాతాలో ఉన్నాయి.
తనకు కానీ, తన కుటుంబసభ్యులకు కానీ బర్త్ సర్టిఫికేట్లు లేవని కేజ్రీవాల్ తెలిపారు. పౌరసత్వాన్ని నిరూపించాలనుకుంటే, తన భార్య వద్ద కానీ, క్యాబినెట్ మంత్రుల వద్ద కానీ జనన ద్రువీకరణ పత్రాలు లేవన్నారు. తమలాంటి వారికే సరైన పత్రాలు లేనప్పుడు ఇక సామాన్యుల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని సూచించారు. ఎన్పీఆర్, ఎన్ఆర్సీను ఉపసంహరించాలని కేంద్రాన్ని కోరినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు. కేంద్ర మంత్రులు కూడా తమ జనన ద్రువీకరణ పత్రాలను చూపించాలని కేజ్రీవాల్ సవాల్ చేశారు. పత్రాలు లేనందున తమను కూడా నిర్బంధ కేంద్రాలకు పంపుతారా? అని ప్రశ్నించారు.
పౌరుల పౌరసత్వాన్ని ప్రశ్నించే వివాదాస్పద చట్టాలను వెనక్కి తీసుకోవాలని కేజ్రీవాల్ కోరారు. NPR ప్రకియలో ప్రజలెవరకు ఎలాంటి డాక్యుమెంట్లు చూపించాల్సిన అవసరం లేదని కేంద్రహోంమంత్రి అమిత్ షా గురువారం రాజ్యసభలో చెప్పిన మరుసటి రోజే…ఢిల్లీ అసెంబ్లీ ఎన్ పీఆర్ కి వ్యతిరేకంగా తీర్మాణం చేసింది. అధికారులు అడిగే సమాధానాలు పూర్తిగా ఐచ్ఛికమని, ఇష్టముంటేనే వెల్లడించవచ్చని, లేదంటే లేదని స్పష్టం చేశారు. ఎన్పీఆర్ జాబితాలో ‘సందేహాస్పద’ (D) అనే కేటగిరీ ఉండదని గురువారం రాజ్యసభలో అమిత్ షా ప్రకటించారు.
ఇదివరకే పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ పీఆర్ ను అమలుచేయబోమని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఎన్ పీఆర్ ప్రక్రియ చేపట్టబోమని కేరళ,వెస్ట్ బెంగాల్,బీహార్(బీజేపీ మిత్ర పక్షం),రాజస్థాన్ సహా పలు రాష్ట్రాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బీజేపీ మిత్రపక్షంగా కొనసాగుతున్న తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీ కూడా ఎన్ పీఆర్ ప్రక్రియ చేపట్టబోమంటూ బీజేపీకి బిగ్ షాక్ ఇచ్చింది. ఎన్ పీఆర్ ప్రక్రియ పై రాష్ట్రం సందేహాలను కేంద్రం తీర్చనంతవరకు ఎన్ పీఆర్ చేపట్టే ప్రశక్తే లేదని అన్నా డీఎంకే తేల్చి చెప్పింది.