బీహార్ లో ఘోర ప్రమాదం..ఏడు ప్రాణాలు తీసిన అతి వేగం..
బీహార్ గయా జిల్లా అమాస్ పట్టణంలోని విష్ణుపూర్ అమాస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిషుగంజ్ గ్రామానికి సమీపంలో ఘోరప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆటోలోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో గయా జిల్లా పోలీసులు హుటాహుటిని ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఔరంగాబాద్లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం గయా జిల్లా ఆస్పత్రికి పంపించారు. లారీ మితిమీరిన వేగంతో రావడమే ప్రమాదానికి కారణమైందని పోలీసులు చెప్పారు. అధికవేగంతో వచ్చిన లారీ అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు ఆటోలను ఢీకొట్టిందని తెలిపారు. మృతులంతా గయా జిల్లాకు చెందిన వారని, ఔరంగాబాద్లోని బంధువుల ఇంట్లో ఫంక్షన్కు హాజరై తిరిగి గయాలోని స్వగ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం బారినపడ్డారని పోలీసులు వివరించారు.
కాగా..ప్రతీ రోజు జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో ఎన్నో కుటుంబాలు తమ ఆత్మీయులకు కోల్పోతున్నాయి. మరెన్నో కుటుంబాలు యాక్సిడెంట్లలో గాయపడినవారితో సమస్యలను ఎదుర్కొంటున్నాయి. చాలా సందర్భాలలో యాక్సిడెంట్లలో అవయవాలు పోగొట్టుకుని జీవచ్ఛవాల్లా బ్రతుకుతున్నవారు మరెందరో.అతి వేగం..డ్రంక్ అండ్ డ్రైవ్..డ్రైవింగ్ ల ోనిర్లక్ష్యం ఇలా కారణం ఏదైనా ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.