నిరుద్యోగ భారతం: పారిశుద్ధ పోస్టు కోసం 7వేల ఇంజనీరింగ్ అభ్యర్థులు
తమిళనాడు కోయంబత్తూర్ నగర మున్సిపల్ కార్పొరేషన్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు సైతం పారిశుద్ధ్య కార్మికుల ఉద్యోగాల కోసం అప్లై చేసుకున్నారు. కోయంబత్తూర్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 549 గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో ఈ పోస్టులను దక్కించుకునేందుకు అప్లికేషన్లు వెల్లువెత్తాయి. దీంట్లో విశేషమేమంటే కేవలం 549 పోస్టుల కోసం అప్లై చేసుకున్నవారిలో 7వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉండటం.
ఈ సందర్భంగా..అరుణ్ కుమార్ అనే ఇంజనీరింగ్ చదివిని నిరుద్యోగి మాట్లాడుతూ..నేను బీఈ మెకట్రానిక్స్లో ఇంజినీరింగ్ చేశాను. ఎన్నో జాబులకు అప్లై చేశాను. నా చదువుకు సంబంధంలేని జాబులకు కూడా అప్లై చేశాను. కానీ ఎటువంటి నాకు ఇప్పటి వరకూ ఉద్యోగం దొరకలేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికుడి పోస్టు కోసం అప్లికేషన్ పెట్టుకున్నానని చెప్పాడు. తనతో పాటు మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన తన 13 మంది ఫ్రెండ్స్ కూడా మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల పోస్టుల కోసం అప్లికేషన్ పెట్టుకున్నారని చెప్పాడు.
గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల భర్తీ అప్లికేషన్స్ ను తాము పరిశీలించగా..వారిలో గ్రాడ్యుయేట్లు,పోస్ట్ గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లతో పాటు 7వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు కూడా ఈ పోస్టుల కోసం అప్లై చేసుకున్నారని కోయంబత్తూర్ మున్సిపల్ అధికారులు చెప్పారు.
కోయంబత్తూర్ సిటీ మున్సిపాలిటీలో 2వేల మంది పర్మినెంట్ కార్మికులు..ఐదు వందలమంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నారు. పారిశుద్ధ కార్మికులు ఉదయం మూడు గంటలు..సాయంత్రం మూడు గంటలు పని చేయాల్సి ఉంటుంది. దీని కోసం రూ.20వేల జీతం ఉంటుంది.
చదువుకు తగిన ఉద్యోగం దొరకటంలేదు. దీంతో ఇంజనీరింగ్ చదివి ఇంజనీర్లు అవ్వాలని కలలు కన్న విద్యార్థులు పారిశుద్ధ కార్మిక ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నిరుద్యోగ భారత దేశంలో ఇటువంటివి తప్పనిసరిగా మారాయి.