Mamata Banerjee : బెంగాల్ గవర్నర్ పై మమత తీవ్ర ఆరోపణలు
వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ..ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్పై తీవ్ర విమర్శలు చేశారు.
Mamata Banerjee వెస్ట్ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ..ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ కర్పై తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ ఒక అవినీతిపరుడని..1996 నాటి హవాలా జైన్ కేసులో ధన్కర్ పై చార్జిషీట్ దాఖలైందని సోమవారం మీడియా సమావేశంలో మమతా బెనర్జీ తెలిపారు. ఈ కేసు విషయంలో గవర్నర్ కోర్టుకి వెళ్లి తన పేరుని తొలగించుకున్నాడని..కానీ ఓ రిట్ పిటిషన్ ఇంకా పెండింగ్ లో ఉందని..అందులో గవర్నర్ ధన్ కర్ పేరు ఉందని మమతాబెనర్జీ తెలిపారు.
ఇలాంటి గవర్నర్ ని కేంద్రం ఎందుకు అనుమతిస్తుంది అని మమత ప్రశ్నించారు. ఛార్జ్ షీట్ తీసుకొని గవర్నర్ పేరు ఉందో లేదో చూడాలన్నారు. బెంగాల్ గవర్నర్ గా ధన్ కర్ ని తొలగించాలని తాను కేంద్రానికి కూడా పలు లేఖలు కూడా రాశానని ఆమె తెలిపారు. రాజ్యాంగం ప్రకారం..తాను గవర్నర్ ని కలవడం,మాట్లాడటం యధావిధిగా కొనసాగుతుందని..కానీ తన లేఖల ఆధారంగా కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మమత అన్నారు.
ఇక,గవర్నర్ నార్త్ బెంగాల్ పర్యటనను కూడా మమత తప్పుబట్టారు. గవర్నర్ ఉన్నపళంగా నార్త్ బెంగాల్ కి ఎందుకు వెళ్లారు అని మమత ప్రశ్నించారు. నార్త్ బెంగాల్ ని విడదీశే కుట్రే ఆయన పర్యటన పరమార్థం అని మమత ఆరోపించారు. ఆయన తన పర్యటనలో నార్త్ బెంగాల్ మరియు జంగల్ మహల్ కు ప్రత్యేక రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తున్న బీజేపీ ఎంపీలు,ఎమ్మెల్యేలను మాత్రమే గవర్నర్ కలిశాడని మమత ఆరోపించారు.
ఇక,మమతాబెనర్జి చేసిన ఆరోపణలను గవర్నర్ జగదీప్ ధన్కర్ తిప్పికొట్టారు. తనపై ఎలాంటి కేసులు లేవని స్పష్టంచేశారు. మీ గవర్నర్పై ఎప్పుడూ చార్జిషీట్లు దాఖలు కాలేదు. అలాంటి డాక్యుమెంట్లు ఏవీ లేవు. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం. సీనియర్ నాయకురాలైన మమతాబెనర్జి ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తారని నేను ఊహించలేదు. నేను హవాలా కేసుకు సంబంధించి ఏ కోర్టు నుంచి కూడా స్టే తీసుకోలేదు. ఎందుకంటే నాపై ఎలాంటి కేసులు లేవు కాబట్టి అని గవర్నర్ వ్యాఖ్యానించారు.