అయోధ్యలో మసీదు ప్రారంభోత్సవానికి వెళ్ళను
అయోధ్యలో రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం కోసం ఆగష్టు-5,2020న భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజ,శంకుస్థాపన కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఆ వేడుకలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు.
అయితే, గతేడాది అయోధ్య కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం… అయోధ్యలో మసీదును కూడా నిర్మించాల్సి ఉన్నది. ఒకవేళ ఆ మసీదు ప్రారంభోత్సవానికి ఆహ్వానం వస్తే, ఆ కార్యక్రమానికి ఓ హిందువుగా తాను వెళ్లదలుచుకోలేదని సీఎం యోగి క్లారిటీ ఇచ్చారు.
ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సీఎం యోగి ఆదిత్యనాథ్ బదులిస్తూ.. ఒక సీఎంగా తనకు మతాలతో ఎటువంటి సమస్య లేదని, తలకు టోపీ పెట్టుకుని రోజా, ఇఫ్తార్లకు వెళ్లేవారు సెక్యులర్ అన్నట్లుగా చెప్పుకుంటున్నారని సీఎం యోగి ఆరోపించారు.
తాను యోగినని, అందుకే మసీదు ప్రారంభోత్సవానికి వెళ్లనని, ఒక హిందువుగా తనకు నచ్చినట్లు ప్రార్థనలు చేస్తానన్నారు. మసీదు నిర్మాణంలో తాను భాగస్వామి కాదు అని, అందుకే తనను ఎవరూ పిలువరని, అక్కడికి వెళ్లాలని లేదని, అయినా తనకు ఆహ్వానం వస్తుందనుకోవడం లేదని యోగి తెలిపారు.