ఎంజాయ్ చేసి పారిపోతున్నాడు : రాహుల్ పై స్మృతీ ఇరానీ ఫైర్
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఫైర్ అయ్యారు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ.అమేథీ ప్రజలను రాహుల్ అవమానించారన్నారు. ఈ మోసాన్ని ప్రజలు క్షమించరు.. తప్పక బదులు తీర్చుకుంటారన్నారు.గురువారం వయనాడ్ లోక్ సభ అభ్యర్థిగా రాహుల్ నామినేషన్ వేశారు.అమేథీలో బీజేపీ అభ్యర్థిగా స్మృతీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సందర్భంగా నియోజకవర్గంలోఇవాళ ఆమె పర్యటించారు.
ఈ సందర్భంగా స్మృతీ మాట్లాడుతూ… 15 ఏళ్ల పాటు ఇక్కడ అధికారాన్ని ఎంజాయ్ చేసి.. ఇప్పుడు మరో లోక్ సభ స్థానం కోసం రాహుల్ అమేథీని విడిచి వెళ్లిపోయారు. మా పార్టీ అమేథీని అభివృద్ధి చేయడం కోసం నన్ను ఇక్కడుకు పంపింది.15 ఏళ్లుగా ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన వ్యక్తి అమేథీని నాశనం చేశాడు.ఇన్నేళ్ల పాటు అమేథీలో తనను నమ్ముకుని ఉన్న కార్యకర్తలను మోసం చేశారు. ఈ మోసాన్ని, అవమానాన్ని, అన్యాయాన్ని అమేథీ సహించదు. తగిన సమాధానం చెప్తుందన్నారు.వయనాడ్ లో రాహుల్ కి ఓటు వేయాలనుకునేవారు ఒక్కసారి అమేథీలో పర్యటించాలన్నారు.