Airfares Hike : వామ్మో.. ఢిల్లీ టు న్యూయార్క్ టికెట్ ధర రూ.6 లక్షలు.. భారీగా పెరిగిన విమాన ప్రయాణ ఛార్జీలు
ఒమిక్రాన్ భయంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్రజలు తిరిగి సొంత దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరిగాయి.
Airfares Hike : కరోనా మహమ్మారి వెలుగు చూసి.. దాదాపు రెండేళ్లు కావస్తోంది. ఈ రెండేళ్ల కాలంలో అనేక కొత్త వేరియంట్లు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేశాయి. నిన్నమొన్నటి దాకా అత్యంత ప్రమాదకారిగా డెల్టా వేరియంట్ ప్రజలను వణికించింది. ఇప్పుడు డెల్టా వేరియంట్ ను తలదన్నే.. ఒమిక్రాన్ అనే మరో కొవిడ్ వేరియంట్ సౌతాఫ్రికాలో వెలుగు చూసింది. కరోనా తగ్గుముఖం పట్టి… సాధారణ పరిస్థితులు నెలకొంటున్న పరిస్థితుల్లో.. ఈ ఒమిక్రాన్ వేరియంట్.. భయబ్రాంతులకు గురి చేస్తోంది.
కరోనా వైరస్ నుంచి తాజాగా రూపాంతరం చెందిన ఒమిక్రాన్ వేరియంట్.. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ ను తొలుత గుర్తించగా, ఆ తర్వాత పలు ఆఫ్రికా దేశాలతో పాటు ఆస్ట్రేలియా, ఇటలీ, జర్మనీ, నెదర్లాండ్స్, బ్రిటన్, ఇజ్రాయల్, హాంకాంగ్, బోట్స్ వానా, బెల్జియం తదితర దేశాల్లో కూడా ఈ వేరియంట్ ను గుర్తించారు.
RedRail : ఇకపై రైల్వేటిక్కెట్ల బుకింగ్ చాలా ఈజీ..ఐఆర్సీటీసీతో చేతులు కలిపిన RedBus
ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రిస్క్ అధికంగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులపై కొత్త రూల్స్ను తీసుకొచ్చింది భారత ప్రభుత్వం. ఇదిలా ఉంటే, ఒమిక్రాన్ భయంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్రజలు తిరిగి సొంత దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో విమానం చార్జీలు భారీగా పెరిగాయి. ఢిల్లీ నుంచి యూకే, యూఎస్, బ్రిటన్, కెనడా రూట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ రూట్లలో విమానం చార్జీలు రెండు మూడింతలు పెరిగాయి.
సాధారణంగా అత్యవసర పరిస్థితుల్లో ఢిల్లీ నుంచి టోరంటో వెళ్లేందుకు విమానం చార్జీ రూ.80 వేల వరకు ఉంటుంది. అయితే, ఒమిక్రాన్ భయం కారణంగా ఈ రేటు రూ. 2.37 లక్షలు పెరిగింది. ఢిల్లీ నుంచి లండన్కు రూ. 60 వేలు ఉంటే ఇప్పుడు ఆ టికెట్ ధర రూ.1.22 లక్షలకు పెరిగింది. గతంలో ఢిల్లీ నుంచి యూఏఈ, యూఏఈ నుంచి ఢిల్లీకి రౌండ్ ట్రిప్ కు రూ. 20వేలు ఉంటే ఇప్పుడు రూ.33 వేలకు చేరింది. భారత్ అమెరికా మధ్య రిటన్ టికెట్లు గతంలో రూ.90 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు ఉంటే ఇప్పుడు రూ. 1.7 లక్షలకు చేరింది. ఇక బిజినెస్ క్లాస్ టికెట్ల ధరలు మరింతగా పెరిగాయి. ఢిల్లీ నుంచి చికాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ లకు బిజినెస్ క్లాస్ టికెట్ల ధరలు ఏకంగా రూ.6 లక్షలకు చేరడం విశేషం.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఇప్పటికే ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన దేశాల విమానాల రాకపోకలపై పలు దేశాలు నిషేధం విధించాయి. భారత్ కూడా అంతర్జాతీయ ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఒమిక్రాన్ వైరస్ బారిన పడినవారిలో తొలుత అలసటగా ఉంటుంది. ఒంటి నొప్పులు, గొంతులో కొద్దిగా గరగరగా ఉండటం, పొడి దగ్గు, కొద్ది పాటి జ్వరం కూడా ఉంటుంది. చాలా మటుకు చికెన్ గున్యా లక్షణాలే ఉంటాయి. కరోనా తొలి వేవ్ లో వైరస్ బారిన పడిన వారికి కూడా ఒమిక్రాన్ సోకవచ్చు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికి కూడా వైరస్ సోకే అవకాశం ఉంది. సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడిన వారికి ఈ వైరస్ సోకే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. వైరస్ సోకినా చాలా మందికి తెలియకుండానే పోతుంది.