మందుబాబులకు సైంటిస్టుల వార్నింగ్

మందుబాబులకు సైంటిస్టుల వార్నింగ్

Alcohol abuse can change male DNA: మీరు మద్యం తాగుతారా? 24 గంటలూ అదే పనేనా? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్టే.. ఈ మాట అంటున్నది మేము కాదు, సైంటిస్టులు. అతిగా మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా పురుషుల్లో డీఎన్‌ఏ కూడా మారిపోతుందని నిర్ధారించారు. మందు మానేసినా, తాగడం తగ్గించినా.. ఆ మార్పులు కనీసం 3 నెలల పాటు కొనసాగుతాయని తెలిపారు.

బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెంటల్‌ హెల్త్‌ అండ్‌ న్యూరోసైన్సెస్‌ (ఎన్‌ఐఎంహెచ్‌ఏఎన్‌ఎస్‌) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం తేలింది. మితిమీరిన మద్యపానం వల్ల తొలుత ‘ఆల్కహాల్‌ యూజ్‌ డిజార్డర్‌’ (ఏయూడీ) తలెత్తుతుందని వారు చెప్పారు. ‘‘దీనికి చికిత్స చేయడం కోసం వైద్యులు చాలావరకూ.. వారిని మద్యానికి దూరంగా ఉండాలని సూచిస్తుంటారు. అయినప్పటికీ ఈ రుగ్మత బారినపడ్డ పురుషుల డీఎన్‌ఏలో మార్పులు జరిగాయి. మద్యం మోతాదు తగ్గించుకున్న, పూర్తిగా మానేసిన సందర్భాల్లోనూ ఏయూడీతో వచ్చిన మార్పులు కనీసం మూడు నెలలు కొనసాగినట్లు వెల్లడైంది’’ అని శాస్త్రవేత్తలు చెప్పారు.

21 ఏళ్ల నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న 52 మంది పురుషులపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ మేరకు వెల్లడైంది. ఏయూడీతో రుగ్మత కారణంగా డీఎన్‌ఏలో మిథైల్‌ గ్రూప్స్‌ వచ్చి చేరుతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. అవి డీఎన్‌ఏలో మార్పులు కలిగిస్తాయన్నారు. అయితే జన్యుక్రమాన్ని మార్చబోవని వివరించారు. ఏయూడీ వల్ల ఏటా 30 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. భారత్‌లో 15 నుంచి 54 ఏళ్ల మధ్య వయసువారిలో 29 శాతం మంది మద్యాన్ని సేవిస్తారని అంచనా. వారిలో 12 శాతం మంది రోజూ మందు తాగుతారని, 41 శాతం మంది వారానికోసారి మద్యం పుచ్చుకుంటారని పరిశోధకులు తెలిపారు.

సో, మందుబాబులు ఇకనైనా జాగ్రత్త పడండి. లేదంటే ప్రమాదం తప్పదు. ఏదైనా లిమిట్ గా తీసుకుంటేనే లేదంటే మూల్యం చెల్లించుకోక తప్పదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.