SCBA Elections : దుష్యంత్ బాటలోనే మరో ముగ్గురు రాజీనామా
Supreme Court bar association election సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దవే తన పదవికి రాజీనామా చేసిన రెండు రోజులకే.. తాజాగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కమిటీలోని ముగ్గురు సభ్యులూ రాజీనామా చేశారు. సీనియన్ న్యాయవాది జైదీప్ గుప్తా, హరిన్ పీ రావల్, నకుల్ దివాన్ పదవి నుంచి తప్పుకున్నారు. అయితే.. ఎస్సీబీఏ ప్యానెల్ సభ్యుల రాజీనామాతో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించాలని.. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డేను కోరారు.
కాగా,వర్చువల్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని.. ఈ మేరకు నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్)తో చర్చించినట్టు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ తాత్కాలిక కార్యదర్శి రోహిత్ పాండేకు ఈ ముగ్గురు సభ్యులు లేఖ రాశారు. ఎన్ఎస్డీఎల్తో కుదిరిన ముసాయిదా ఒప్పందం ప్రకారం.. ఎన్నికల నిర్వహణ అంచనా వ్యయాన్ని జనవరి 14న ఎస్సీబీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీకి పంపినట్లు వివరించారు.
ఎన్నికలు నిర్వహించడానికి ప్యానెల్ సభ్యులుగా తమ విధులను కొనసాగించడం సాధ్యం కాదని వారు లేఖలో తెలిపారు. ఇదిలా ఉండగా.. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల జనవరి రెండో వారంలో నిర్వహించాలని నిర్ణయించగా పలు అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అది సాధ్యపడని విషయం తెలిసిందే.