పాక్ బోర్డర్ లో తేజస్ యుద్ధ విమానాలు మోహరింపు

  • Published By: venkaiahnaidu ,Published On : August 18, 2020 / 09:11 PM IST
పాక్ బోర్డర్ లో తేజస్ యుద్ధ విమానాలు మోహరింపు

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వైమానిక దళం అప్రమత్తమైంది. దేశీయంగా తయారు చేసిన తేలికపాటి తేజస్ యుద్ధ విమానాలను పాకిస్థాన్ సరిహద్దులో భారత వాయుసేన ((IAF) మోహరించింది. లడఖ్ సరిహద్దులో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఐఏఎఫ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా తేజస్ స్క్వాడ్రన్‌ను ఇక్కడి నుంచి పశ్చిమ సరిహద్దు వైమానిక స్థావరానికి తరలించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.



ఎల్‌సీఏ తేజస్ యుద్ధ విమానాల 45 స్క్వాడ్రన్ దక్షిణ ఎయిర్ కమాండ్ పరిధిలోని కోయంబత్తూరు సమీపంలోని సులూరు వైమానిక స్థావరంలో కొనసాగుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తేజస్ విమానాలు సరిహద్దుకు తరలివెళ్లాయి. ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా తేజస్ స్క్వాడ్రన్‌ను ఇక్కడి నుంచి పశ్చిమ సరిహద్దు వైమానిక స్థావరానికి తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

దేశ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న ఎర్రకోట వద్ద జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించిన ప్రధాని మోడీ స్వదేశంలో తయారైన తేజస్ యుద్ధ విమానం సత్తాను ప్రశంసించారు. ఎల్ఏసీ మార్క్1ఏ వర్షన్ యుద్ధ విమానాలు కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయని చెప్పారు.



మరోవైపు, చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు ప్రాంతాలపై భారత వాయుసేన గట్టి నిఘా పెట్టింది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఐఏఎఫ్ సర్వసన్నద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్న ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను కూడా రంగంలోకి దించింది.ఐదు రాఫెల్ యుద్ధవిమానాలు సరిహద్దు ప్రాంతాల్లో పగలు, రాత్రిపూట విన్యాసాలు చేస్తూ పహారా కాస్తున్నాయి.