రూ.499కే కరోనా ఆర్టీ-పీసీఆర్ టెస్టులు…6గంటల్లోనే ఫలితం
కరోనా నిర్ధరణ కోసం ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేసే మొబైల్ ప్రయోగశాలలను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సోమవారం ప్రారంభించారు. ఢిల్లీలోని ఐసీఎంఆర్ కేంద్ర కార్యాలయంలో ఆయన ఈ మొబైల్ ప్రయోగశాలల్ని ప్రారంభించారు.
ఈ ల్యాబ్ల ద్వారా కేవలం రూ.499కే అతితక్కువ ఖర్చుతో ఆర్టీపీసీఆర్ కరోనా నిర్ధరణ పరీక్షలు చేయించుకోవచ్చు. టెస్టుల ఫలితాలు కూడా ఆరు గంటల్లోనే తెలుసుకోవచ్చు.
ఢిల్లీలో పెరుగుతున్న కరోనా వైరస్ కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వం, స్పైస్ హెల్త్ సంస్థతో కలిసి సంయుక్తంగా ఈ ల్యాబ్లకు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో భాగంగా ఢిల్లీలో20 ల్యాబ్లు ఏర్పాటు చేయనున్నాం. ఒక్కోటి రోజుకు 1000 టెస్టులు చేస్తుంది. దేశ రాజధానిలో అవసరాన్ని బట్టి ఈ మొబైల్ టెస్టింగ్ సదుపాయాన్ని ఆయా ప్రాంతాల్లో ఉపయోగిస్తాం అని ఐసీఎంఆర్ అధికారులు వెల్లడించారు.
దేశరాజధానిలో కొవిడ్ కేసులు పెరుగుతున్న తరుణంలో నవంబర్ 16న కేంద్ర హోంమంత్రి అమిత్షా అధ్యక్షతన సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఢిల్లీలో కేంద్రం సహకారంతో ఆరోగ్య సదుపాయాలను మెరుగు పరుస్తూ చర్యలు తీసుకుంటున్నారు.